ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: పోలీస్ శాఖలో పనిచేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. భీమడోలు పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఏఆర్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
భీమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, స్థానికంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేపట్టారు. ఈ దాడిలో పలువురు వ్యక్తులతో పాటు ఏలూరు జిల్లా ఏఆర్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్. ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
దీంతో భీమడోలు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆంజనేయులు సహా ఇతరులపై కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ సిబ్బంది ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రమైన తప్పిదమని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనను అత్యంత గంభీరంగా పరిగణించిన ఎస్పీ, శాఖాపరమైన క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను కానిస్టేబుల్ను తక్షణమే విధులనుండి సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


