ANDRAPRADESH, MANYAM, PARAVATHIPURAM: టీడీపీ నాయకుల తీరు మారడం లేదు. BY: PASCHIMA VAHINI సీఎం చంద్రబాబు నాయకులను పదే పదే హెచ్చరిస్తున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. కీలక అధికారులపైనే వారు జులుం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై ఏకంగా మండలానికి అధికారి అయిన.. మహిళా తహసిల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.
ఏం జరిగింది?
పార్వతీపురం తహసీల్దార్ జయలక్ష్మి స్వయంగా రాసుకున్న ఫిర్యాదు మేరకు.. ఆమెను టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బూతులు తిట్టారు. గురువారం రాత్రి ఆమెకు వాట్సాప్ కాల్ చేసిన ఎమ్మెల్యే బూతులు తిట్టాడని.. పైకి చెప్పుకొనే అవకాశం కూడా లేని విధంగా దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కాగా.. విజయచంద్ర.. గత 2024 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం చంద్రబాబు ఆయనకు పిలిచి మరీ పార్వతీపురం టికెట్ ఇచ్చారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విజయచంద్ర పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే చంద్ర బాబు పిలిచి ఆయనకు పిల్లనిచ్చినట్టుగా పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మన్యం ప్రాంతంలో గత కొన్నాళ్లు మట్టి, మద్యం అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇటీవల కలెక్టర్కు సీఎం చంద్రబాబు క్లాస్ ఇచ్చారు. ఎవరైనా సరే.. అక్రమాలు చేస్తే అడ్డుకోవాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. దీంతో తహసీల్దార్ జయలక్ష్మి.. ఎమ్మెల్యే అనుచరుల వాహనాలను అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలోనే నావాళ్లకి కూడా ఆపుతారా? అంటూ.. ఎమ్మెల్యే విజయ చంద్ర. తహసీల్దార్ పై విరుచుకుపడ్డట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మహిళ అని కూడా చూడకుండా.. ఆమెపై బూతు పురాణం అందుకున్నారని.. స్వయంగా ఆమె రాసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. కాగా.. 2014-19 మధ్య కూడా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లోనూ స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత.. రాజీ కుదరడంతో కేసులు ఎత్తేశారు.