ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టడంలో ప్రజల అవగాహన కీలకమని పోలీసులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి నరసింగపాలెం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే నేరాల నివారణ, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, పోక్సో చట్టం, నూతన క్రిమినల్ చట్టాలపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై వేధింపులు, దాడులు, చిన్నారులపై లైంగిక నేరాల విషయంలో చట్టపరమైన రక్షణలు, ఫిర్యాదు చేసే విధానం, పోలీసుల సహకారం గురించి అధికారులు వివరించారు.
పోక్సో చట్టం ద్వారా చిన్నారుల రక్షణకు ఉన్న కఠిన నిబంధనలను ప్రజలకు వివరించారు. బాలలపై జరిగే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పులు, వాటి అమలు, ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
గ్రామాల్లో మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులు మరియు సమాజం కలిసి పనిచేసినప్పుడే నేరాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని చట్టాలు, భద్రతా చర్యలపై అవగాహన పొందారు.



