మండపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: పట్టణంలో యువతకు ఆత్మరక్షణ, ఆరోగ్యాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. బస్టాండ్కు ఎదురుగా ఉన్న యేకుల సత్యనారాయణ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన “మదర్ తెరెసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ”ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అకాడమీ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువతకు మార్షల్ ఆర్ట్స్ విద్యలు ఎంతో అవసరమని తెలిపారు. చిన్ననాటి నుంచే ఈ విద్యలను అభ్యసించడం ద్వారా శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, యువతులు స్వీయరక్షణకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ కౌన్సిలర్, ప్రతిపక్ష నేత రెడ్డి రాధాకృష్ణ, యువ పారిశ్రామికవేత్త వేగుళ్ల అజయ్ బాబు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బుంగ సంజీయ్, టిడిపి సీనియర్ నాయకులు ఉంగరాల రాంబాబు, బిజెపి నాయకులు కోన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టి. వెంకటలక్ష్మి, జి. నాగబాబు, పి. సత్యకాంత్, వి. అనిల్ కుమార్ సహా పలువురు ఆర్గనైజర్లు, క్రీడాభిమానులు కార్యక్రమానికి హాజరయ్యారు.



