ఆలమూరు మండలం, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ విధానం పనిచేయదన్న సందేహాలకు చెక్ పెడుతూ ఆలమూరు మండలం రికార్డు స్థాయిలో ఇంటి పన్నుల వసూళ్లు సాధించింది. పంచాయతీరాజ్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్ పన్నుల విధానం అద్భుత ఫలితాలను ఇచ్చి, గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ వ్యవస్థ విజయవంతమైందని నిరూపించింది. ఈ విజయంతో గ్రామ పాలనలో పారదర్శకత మరింత బలపడింది.
కొత్తపేట డివిజన్కు చెందిన ఆలమూరు మండలంలోని 18 గ్రామపంచాయతీల ద్వారా మొత్తం రూ.1 కోటి 98 లక్షల 69 వేల పన్నులు వసూలు చేయడం విశేషం. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా పన్నుల వసూళ్లు కొనసాగేవి. కానీ ఈసారి మార్చి 31తోనే ఆన్లైన్ సైట్ మూసివేయబడినప్పటికీ ఇంత భారీ వసూళ్లు రావడం ప్రత్యేకంగా నిలిచింది.
ఎంపీడీవో ఎ.రాజు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ఈ ఫలితం సాధ్యమైంది. మొత్తం 16,793 ఇంటి యజమానుల నుంచి పన్నులు వసూలు చేయగా, మొత్తం లక్ష్యంలో 88.3 శాతం వసూళ్లు నమోదు కావడం గమనార్హం. అసెస్మెంట్ల పరంగా చూస్తే 92.12 శాతం వసూళ్లు జరగడం మరో విశేషం.
ఈ వసూళ్లలో నవాబుపేట, నర్సిపూడి, కలవచర్ల, సూర్యారావుపేట గ్రామపంచాయతీలు 100 శాతం పన్నులు వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. అలాగే ఎనిమిది గ్రామాలు 90 శాతం పైగా వసూళ్లు నమోదు చేయడం గ్రామీణ ప్రజల్లో చైతన్యం పెరిగిందనడానికి నిదర్శనం.
ఆన్లైన్ విధానం వల్ల పన్నుల సొమ్ము నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ కావడం ద్వారా అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా ఉన్నప్పటికీ, మొత్తం మీద ఈ డిజిటల్ విధానం గ్రామీణ పాలనలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని అధికారులు భావిస్తున్నారు.


