హైదరాబాద్, పశ్చిమవాహిని, మార్చి 16: హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటనలో పట్టుబడిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్లో కూడా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందన్న ఆయన, టీడీపీ ఇప్పుడు రాజకీయ పార్టీగా కాకుండా ‘తెలుగు డ్రగ్స్ పార్టీ’గా మారిపోయిందని అన్నారు.డ్రగ్స్ కారణంగా యువత నాశనం అవుతున్నారని, తాను గెలిస్తే డ్రగ్స్ లేని ఏలూరు పార్లమెంట్గా తీర్చిదిద్దుతానని, ఎన్నికల సమయంలో చెప్పిన వ్యక్తి, గెల్చిన తర్వాత ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పట్టుబడటం అత్యంత సిగ్గుచేటు అని జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులతో కలిసి ఏలూరులో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆక్షేపించారు.
ప్రజాస్వామ్యానికే అవమానం
మిత్రులు రాజస్థాన్ చెందిన మాజీ ఎమ్మెల్యే నితీన్శర్మతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్యాదవ్ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు అని అన్నారు.ఒక పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి డ్రగ్స్ పార్టీ నిర్వహించడం, అందులో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి అవమానం అని అన్నారు. తన గౌరవాన్ని ఏ మాత్రమైనా కాపాడుకోవాలంటే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీపై దాడి చేసిన పోలీసులపైనే కాల్పులు జరపడం అత్యంత దారుణం అని మండిపడ్డారు.
‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గుంటూరు, మంగళగిరి, విశాఖపట్నం, నెల్లూరు ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. పోలీసు వ్యవస్థను ప్రజల కోసం కాకుండా రెడ్బుక్ అమలు కోసం ఉపయోగిస్తున్నారు. హోం మంత్రి వైసీపీ నేతలను తిట్టడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు వినిపించడం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది’అని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నిజంగా డ్రగ్స్పై చర్య తీసుకోవాలనుకుంటే పుట్టా మహేష్ యాదవ్ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవి నుంచి రాజీనామా చేయించాలి. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి భారీ నిరసనలు చేపడతామని దూలం నాగేశ్వరరావు హెచ్చరించారు.
పుట్టా మహేష్ ఏలూరు ఎంపీ కావడం మా దౌర్భాగ్యం: మామిళ్లపల్లి జయప్రకాశ్
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడటం రాష్ట్రానికి, ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలకు తీవ్ర అవమానకరం అని ఏలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ అన్నారు. ఈ కేసులో ఎంపీని తప్పించేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నాలు చేసినప్పటికీ...అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూడా ఉండటంతో అది సాధ్యం కాలేదు. గంజాయిని పూర్తిగా నియంత్రించామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి తరచూ ప్రకటనలు చేస్తున్నారని...కానీ వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
సాక్షాత్తూ ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇదే తొలిసారి... అలాంటి వ్యక్తి ఏలూరు ఎంపీగా ఉండటం ప్రజల దురదృష్టం. పుట్టా మహేష్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఏలూరులో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఏలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాశ్ డిమాండ్ చేశారు.



.jpeg)








