తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్: షోకాజ్ నోటీసులు జారీ...?

 


తెలంగాణ, పశ్చిమవాహిని, మార్చి 16: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ రావడంతో ఆయనపై ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది. అంతేకాదు ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు సైతం ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని శంఖించేంత వరకు వెళ్లింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడుకు చిత్తశుద్ధి ఉంటే మహేశ్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అదే పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌పై డ్రగ్స్ సేవించినట్లు వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఆ పార్టీకి మింగుడుపడనీయడం లేదు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణ కోరారు.

సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్

తెలుగు రాష్ట్రాల్లో మెయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ అంశం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇదే అంశం తెలుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టార్గెట్ చేస్తుంటే ఏపీలో తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేస్తోంది.ముఖ్యంగా ఈ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌కు చేసిన పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అది టీడీపీని చిక్కుల్లో పెట్టింది. ఎంపీపై వస్తున్న వార్తలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వననంటూ వార్నింగ్

మెయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎంపీ పుట్టా మహేశ్‌ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలుస్తోంది.ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తులు, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలుస్తోంది.