కొత్తపేట, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నమోదైన మిస్సింగ్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపించకుండా పోయిన ఒక యువతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 24 గంటలు పూర్తి కాకముందే గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం సమన్వయంతో పనిచేసి యువతి ఆచూకీని తెలుసుకుంది. కేసు నమోదు చేసిన వెంటనే పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం, సాంకేతిక ఆధారాలు సేకరించడం ద్వారా వేగంగా స్పందించారు.
మిస్సింగ్ అయిన యువతిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఐ సురేంద్రతో పాటు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల అప్రమత్తత, సమయస్ఫూర్తి మరోసారి ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచిందని స్థానికులు అభినందించారు.







