అవును... ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతున్న సంగతి తెలిసిందే.
ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని విధాలా మద్దతు, సహకారం.. రాష్ట్రం నుంచి కేంద్రానికి అన్ని విధాలా మంచి పేరు, తోడు అన్నట్లుగా కూటమి పార్టీల మధ్య అనుబంధం, అవగాహన సాగుతుందని అంటున్నారు. ఈ సమయంలో మోడీ ఇచ్చిన టాస్క్, పవన్ ఇచ్చిన సవాల్ ను లోకేష్ సింగిల్ గా టేకప్ చేశారు.
అవును... ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... ప్రతి ఒక్కరి విజయం వెనుక ఉండేది, తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది గురువులని.. మన ఎదుగుదలను కోరుకునేది గురువులే అని అన్నారు. ఇదే సమయంలో... మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని.. తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం అని తెలిపారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు.
ఇదే సమయంలో... పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావు లేదని చెప్పిన లోకేష్.. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుగుతోందని అన్నారు. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే పవన్ సవాల్ కు స్పందించారు. ఇందులో భాగంగా... అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని చెప్పిన లోకేష్... ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పవన్ సవాల్ విసిరారని అన్నారు. ఈ సందర్భంగా.. "పవన్ సవాల్ ను నేను స్వీకరిస్తున్నా.. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం" అని లోకేష్ తెలిపారు.
దీంతో... ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో కూటమి పార్టీల మధ్య పాలన సాగుతోందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi