భీమవరం, ఫిబ్రవరి 24: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడిలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాదు సురేష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
భీమవరంలోని ఒక సామిల్ యజమాని నుండి రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. టేకు కలప స్వాధీనం చేసిన అనంతరం మిల్లును తిరిగి నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి అధికారి సాదు సురేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో భీమవరం పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.







