ANDRAPRADESH: మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన జగన్ గ్యాంగ్ను ఎట్టి పరిస్థితిలోనూ క్షమించేంది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ‘‘మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగం నయం చేస్తాం. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. అమరావతిపై విషయం చిమ్మితే అది వెళ్లి తాడేపల్లి ప్యాలెస్లో పడుతుంది. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం’’ అని నారాలోకేష్ వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
వైసీపీ అధినేత జగన్కు చెందిన మీడియాలో జరిగిన చర్చలో అమరావతి రాజధానిపై యాంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారనేది మహి ళలు చెబుతున్న మాట. దీనిపై అమరావతి మహిళలు సహా.. పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధానితో పాటు మహిళలను కూడా కించపరిచేలా వ్యవహరించారని.. యాంకర్.. కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. దీనిపై రాజధాని ప్రాంతంలో మహిళలు నిరసన, ఆందోళన నిర్వహించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి నారా లోకేష్.. జగన్ గ్యాంగ్ను వదిలి పెట్టేది లేదన్నారు. ``అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచే మహళా లోకాన్ని కించపరిచిన జగన్రెడ్డి గ్యాంగ్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించ బోం`` అని వ్యాఖ్యానించారు. మహిళలను కించ పరిచారని.. ఇలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించా రు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు.. ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ జగన్ కు తొలినుంచీ మహిళలంటే చిన్నచూపే. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లినే గౌరవించని వ్యక్తి, ఇతర మహిళల్ని గౌరవిస్తాడు అనుకోవడం దురాశే`` అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దుయ్యబట్టారు.
``రాజధానిపై జగన్, అతని పేటీఎం బ్యాచ్ది పైశాచికానందం..! తలాతోకా లేని వ్యాఖ్యలతో మహిళల్ని కించపరుస్తున్నారు. గత ఐదేళ్లు ఎక్కడుండి పరిపాలన చేశారు..? వైసీపీ అధినేత జగన్ ఇల్లు ఎక్కుడుంది..? మీరు ఎక్కడున్నారు..? ఇంకెంత కాలం అమరావతిపై విషప్రచారం చేస్తారు?`` అని గురజాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు విమర్శించా రు. అదేవిధంగా ``ఉచ్ఛ నీఛాలు మరిచి అమరావతి మహిళలపై వ్యాఖ్యలు చేయటం వైసీపీ సంస్కృతికి నిదర్శనం`` అని తెలుగు మహిళ నాయకురాలు తలశిల స్వర్ణలత అన్నారు. అమరావతి రాజధానిపై వైసీపీ ఛానల్లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన ఘటన జగన్ ప్రోత్సాహంతోనే జరిగిందన్నారు.