INDIA NEWS, BENGALURU: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటతో మరోసారి దేశంలో ఈ తరహా ఘటనలపై చర్చ మొదలైంది. క్రికెట్ పిచ్చి 11 మంది ప్రాణాలు బలితీసుకుంది. అయితే ఇంతకంటే దారుణమైన తొక్కిసలాటలో దేశంలో కొన్ని జరిగాయి.
దేశంలో అతిపెద్ద తొక్కిసలాట దుర్ఘటన 2005లో జరిగింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్దేవి ఆలయంలో వార్షిక తీర్థయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలటాలో 340 మందికి పైగా భక్తులు మరణించారు. భక్తులు మెట్లపై కొబ్బరికాయలు కొట్టడంతో, వేలాది మంది మెట్లపై నుంచి జారడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇక 2008లో రాజస్థాన్లోని జోధ్పూర్ లోని ఓ ప్రముఖ ఆలయంలో బాంబు పేలిందనే పుకార్లు వ్యాపించాయి. ఫలితంగా తొక్కిసలాట జరిగి దాదాపు 250 మంది భక్తులు మరణించారు. ఇదే ఏడాది హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవి ఆలయం వద్ద రాళ్లు విరిగిపడ్డాయనే వదంతుల కారణంగా జరిగిన తొక్కిసలాటలో 162 మంది మరణించారు.
గతేడాది ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలామందికి గుర్తు. ఈ సత్సంగ్ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు చేయని కారణంగా తొక్కిసలాట జరిగి, మహిళలు, పిల్లలు సహా 121 మంది మరణించారు.
2013లో మధ్యప్రదేశ్లోని రతన్గఢ్ ఆలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. భక్తులు నడుస్తున్న నది వంతెన కూలిపోతుందనే పుకార్ల కారణంగా ఈ తొక్కిసలాట జరిగింది.
2011లో కేరళలోని ఇడుక్కి జిల్లాలో శబరిమల యాత్రకు వెళ్తున్న భక్తుల పైకి జీపు దూసుకెళ్లడంతో జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. వీటితో పాటు తిరుపతి వైకుంఠద్వార దర్శన టికెట్ల సమయంలో, గోదావరి పుష్కరాల్లో, మహాకుంభమేళాలో తొక్కిసలాటలు జరిగి పదుల సంఖ్యలో భక్తులు మృతిచెందారు.