TELANGANA: కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులు, కొందరు బీఆర్ఎస్ నాయకులు దైవాంశ సంభూతుడిగా చూస్తుంటారు. మనసులో ఏముంటుందో తెలియదుగాని పైకి మాత్రం ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఆయన అన్నింటికీ అతీతుడు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఏ విషయంలోనూ ఆయన్ని ప్రశ్నించకూడదంటారు. కొంకాలంగా రచ్చరచ్చ చేస్తున్న కవిత అసలు తనేం చేస్తున్నదో, ఏం చేయబోతున్నదో క్లారిటీ లేదనిపిస్తోంది.
అన్న కేటీఆర్మీద వ్యతిరేకంగా ఉంది. కాని నేరుగా ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించదు. పరోక్ష విమర్శలే. ఆమె మీద మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కొందరు ఆమె కొత్త పార్టీ పెడుతుందని అంటారు. కొందరు వేరే పార్టీలో చేరుతుందని అంటారు. బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్నట్లు కనబడుతుంది. కాని కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. తన మానస పుత్రిక జాగృతికి సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. ఆ సందర్భంగా బీజేపీకి, రేవంత్ రెడ్డికి హెచ్చరికలు చేసింది. ఆమె మాటలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి.
కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అన్నది. ఈమె ఇప్పుడేమీ కొత్తగా అనలేదు. గులాబీ పార్టీ నాయకులు ఎప్పటినుంచో అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు రావల్సిందిగా కేసీఆర్కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై మండిపడింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమా అంటూ ఆగ్రహించింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అన్నది. దీన్నిబట్టి ఆమె అహంకారం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది. అంటే కేసీఆర్ఎలాంటి తప్పు చేయడు. ఆయనది అలాంటి నైజం కాదని చెప్పడమన్న మాట.
ఆయనకు నోటీసులు ఇస్తే కళ్లు పోతాయి అన్నట్లుగా మాట్లాడింది కవిత. కల్వకుంట్ల కుటుంబం తీరే అంత. తాము పులు కడిగిన ముత్యాలం అన్నట్లుగా మాట్లాడతారు. తాము ఉత్తములమని, ఎదుటివారు అధములు అని వారి బలమైన అభిప్రాయం. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు డీకే బారువా అనే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన ‘ఇందిరాయే ఇండియా…ఇండియాయే ఇందిర’ అనే నినాదం క్రియేట్ చేశారు. సేమ్ కేసీఆర్ కుటుంబం కూడా అలానే వ్యవహరిస్తోంది. తెలంగాణపై కేసీఆర్ కుటుంబానికే సర్వహక్కులు ఉన్నాయన్నట్లుగా మాట్లాడతారు.
తెలంగాణను మరెవరూ పరిపాలించకూడదనే ధోరణిలో ఉంటారు. వారిని ఎవరూ ప్రశ్నించకూడదనేది వారి అభిప్రాయం. వారి దృష్టితో తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. కవిత మద్యం కుంభకోణంలో ఇరుక్కొని జైలుకు వెళ్లినప్పుడు తనను కేసులో ఇరికించి అవమానించారని, ఇది మొత్తం తెలంగాణను అవమానించినట్లేనని చెప్పింది. తప్పులు వాళ్ల వ్యక్తిగతం. కాని తెలంగాణకు ఆపాదిస్తుంటారు. అంటే తమకు నోటీసులు ఇచ్చినా, జైల్లో పెట్టినా తెలంగాణ ప్రజలంతా ఉద్యమించాలని వాళ్ల ఉద్దేశం.
కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు కావాలనుకున్నాడు. చాలాసార్లు హరీష్రావుతో సమావేశమయ్యాడు. తన వాదనలు వినిపించేందుకు తగిన కసరత్తు చేశాడు. ఆయన కూల్గానే ఉన్నాడు. కాని కూతురు కవితే రెచ్చిపోతున్నది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా నాలుగో తేదీన మహా ధర్నా నిర్వహిస్తానని చెప్పింది. అంటే కేసీఆర్ విచారణకు ఒక రోజు ముందన్నమాట.
కేసీఆర్కు నోటీసులు ఇచ్చి కూడా చాలా రోజులైంది కదా. మరి మహాధర్నా చేయాలనే ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చిందో…! నోటీసులకు నిరసనగా గులాబీ పార్టీ నాయకులెవరూ నిరసనలు తెలియచేయడంలేదు. అంటే కవిత తలపెట్టిన ధర్నా తన బలనిరూపణకా? ఇక రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనడంలేదట. అసలు జై తెలంగాణ అననివారు సీఎం కుర్చీలో కూర్చోవడానికే పనికిరాడని చెప్పింది
కవిత లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నప్పుడు ప్రతీసారి పిడికిలి పైకెత్తి జై తెలంగాణ అనేది. ఒకసారి కోర్టులో కూడా ఇలాగే అంటే మహిళా న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. రేవంత్ రెడ్డి మీద ఇంకా చాలా విమర్శలు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీసీలకు తానే నాయకురాలినని భావిస్తోంది. ఏమిటో ఆమె ధోరణి అర్థం కావడంలేదు.