ANDRAPRADESH : కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ చేదు నిజం ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి బయటపెట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తండ్రిని పరామర్శించేందుకు వెళ్లిన క్రాంతిని, ఆమె అన్న గిరి అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. మరోసారి ముద్రగడ కుటుంబంలో రచ్చ బజారుకెక్కింది.
తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆయన్ను పరామర్శించాలని వైసీపీ మాజీ నేత ఒకరు మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చారన్నారు. ఈ మేరకు తాను ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లగా సోదరుడు గిరి అడ్డుకున్నారని ఆమె వాపోయారు. తన తండ్రికి అత్యవసర ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అందించలేదని క్రాంతి ఆరోపించడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగా తన సోదరుడు గిరి, అతని మామ అడ్డుకున్నారని క్రాంతి ఆరోపించారు.
ముద్రగడ అనారోగ్యానికి సంబంధించి వాస్తవాల్ని సోదరుడు గిరి ఎవరికీ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. తనను కన్న తండ్రిని పరామర్శించడానికి అనుమతించకపోవడం దుర్మార్గమని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో కన్న తండ్రిని చూడడానికి అనుమతించకపోతే, చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించడం గమనార్హం. మెరుగైన వైద్య సేవల్ని అందించాలని క్రాంతి కోరారు.
ఎన్నికల సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన తరపున ప్రచారం నిర్వహించారు. అప్పట్లో తండ్రి, కుమార్తె వేర్వేరు పార్టీలకు ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినా చూడడానికి రావద్దని కుమార్తెకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది. ఇప్పుడిలా జరిగింది. సోదరి పోస్టుపై గిరి స్పందన ఏంటో తెలియాల్సి వుంది.