TELANGANA, ANDRAPRADESH: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రత్యేకత ఏమంటే, తన గురించి తానే గొప్పలు చెప్పుకోవడం. తన విజనరీ ఎంత గొప్పదో చాటుకోడానికి… హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని అంటుంటారు. సైబరాబాద్ సృష్టికర్తను తానే అని, అదే నేడు తెలంగాణకు ప్రధాన ఆర్థిక వనరని గొప్పలకు పోవడం తెలిసిందే. ఇందుకు కడప మహానాడు మరోసారి వేదికైంది.
హైదరాబాద్ అభివృద్ధికి తానే ఆద్యుడిగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్రా మహానాడులో తెలంగాణ ప్రస్తావన ఎందుకని ఆయన నిలదీయడం గమనార్హం. అంతేకాదు, 2004లోనే తెలంగాణలో చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసిందని ఘాటు విమర్శ చేశారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా బాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ అభివృద్ధికి తానే బీజం వేసినట్టు చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని ఆయన ఖండించారు. తన వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని చంద్రబాబు గొప్పలు చెబుతుంటే, నవ్వొస్తోందని ఆయన దెప్పి పొడిచారు. 2014 నుంచి ఆంధ్రలో మీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన హితవు పలికారు.
తమ నాయకుడు కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయాల లెక్కల్ని జగదీశ్రెడ్డి వివరించారు. ఎప్పటికైనా హైదరాబాద్కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామని అనుకుంటున్నారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిలదీశారు. సమాధానం చెప్పాలని బాబును ఆయన డిమాండ్ చేశారు.