ANDRAPRADESH: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది మంచి పాలన అందించామని చెబుతోంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా అందరూ కూడా చెప్పిన విధంగా హామీలు అమలు చేశామని అంటున్నారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఒక పెద్ద నంబర్ చెబుతున్నారు.
తొలి ఏడాదిలోనే 700కు పైగా అభివృద్ధి, సంక్షేమ హామీలు అమలు చేశామని స్పష్టం చేస్తున్నారు. ఇన్ని వందలలో హామీలను సంక్షేమ హామీలను అమలు చేశామని ఆయన అంటున్నారు.
సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని వైసీపీ నేతలు ఒక వైపు వెన్నుపోటు దినం నిర్వహిస్తూంటే అచ్చెన్న వందల్లో హామీలు అమలు చేసామని చెప్పడంతో రాజకీయంగా చర్చ సాగుతోంది. అచ్చెన్న చెబుతున్న నంబర్ తో వైసీపీ నేతలు విభేదిస్తున్నారు.
కూటమిలో ఎవరూ కూడా ఇంత పెద్ద నంబర్ చెప్పుకోలేదని ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసి మరీ అచ్చెన్న ఈ విధంగా ప్రకటించారు అంటే ఆయనే ఆ వందల హామీలను ఎలా నెరవేర్చారో చెప్పాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.
అయితే అచ్చెన్నాయుడు మాత్రం, “మొదటి నెలలోనే మూడు వేల రూపాయల పింఛన్ను నాలుగు వేలకుపెంపు చేశాం. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాం. 54 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, 24 గంటల్లోనే రైతులకు చెల్లించాం,” అని వివరించారు.
అంతేకాకుండా, 20 వేల కిలోమీటర్ల రోడ్లను గుంతలు లేకుండా మరమ్మతులు చేశామని, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని తెలిపారు.
ఇలా ఇన్ని చేశామని చెబుతూ 700 హామీలుగా చెబుతున్నారు. ఇన్ని వందల హామీలను ఎటూ అమలు చేశరు కదా ఆ చేత్తోనే సూపర్ సిక్స్ హామీలు కూడా నెరవేరిస్తే పోలా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇంతకీ 700 హామీలేంటో అసలు విషయం అచ్చెన్నకే తెలియాలి అని అంటున్నారు.