Hot Posts

6/recent/ticker-posts

కూట‌మి ప్ర‌భుత్వం వార్షికోత్స‌వ కానుక‌: చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌


ANDRAPRADESH: రాష్ట్రంలో 67.27 లక్షల మంది తల్లులు ఉన్నార‌ని తెలిపిన చంద్ర‌బాబు.. వారికి ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌న్నారు. ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వానికి సార‌థ్యం వ‌హిస్తున్న సీఎం చంద్ర‌బా బు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన `సూప‌ర్ సిక్స్‌` హామీల్లో అత్యంత ముఖ్య‌మైన‌, రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న `త‌ల్లికి వంద‌నం` ప‌థ‌కంపై చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు. 

``కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా గురువారం త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి నిధులు విడుద‌ల చేస్తున్నాం.`` అని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కింద ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు చదువుకునే వారు ఉంటే అంత‌మందికీ రూ.15000 చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. 


రాష్ట్రంలో 67.27 లక్షల మంది తల్లులు ఉన్నార‌ని తెలిపిన చంద్ర‌బాబు.. వారికి ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు చేస్తామ‌న్నారు. ఈ క్ర‌మంలో 8,745 కోట్ల రూపాయ‌లు ఈ ప‌థ‌కానికి వెచ్చిస్తున్న‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ నిధుల‌ను గురువారం విడుద‌ల చేయ‌నున్నామ‌న్నారు. 

అంతేకాదు.. ఇప్ప‌టికే చ‌దువుతున్న వారితోపాటు.. ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్మీడియెట్‌లో చేరే వారికి కూడా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు ముఖ్య‌మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వంపై ఎంత భారం ప‌డినా లెక్క చేయ‌బోమ‌ని.. త‌ల్లుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం దీనిని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. 

ప్ర‌భుత్వం గురువారం నిధులు విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ.. త‌ల్లుల ఖాతాల్లో మాత్రం విద్యార్థులు ఆయా పాఠ‌శాల‌లు, కాలేజీల్లో చేరి.. అడ్మిషన్లు పూర్తయ్యాక మాత్ర‌మే ఈనిధులు వారి వారి ఖాతాల్లో జ‌మ‌కానున్నాయి. అప్ప‌టికి విద్యార్థుల‌కు-త‌ల్లుల‌కు సంబంధించిన జాబితాలు ప్ర‌భుత్వానికి చేరుతాయ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. 

ఈ మేరకు త‌ల్లికి వంద‌న ప‌థ‌కానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌తి ఒక్క ల‌బ్ధిదారుల ఖాతాలో సొమ్ములు జ‌మ అవుతాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇదిలావుంటే.. కూట‌మి పాల‌న‌లో ఏడాది కాలంలో అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామ‌ని సీఎం వివ‌రించారు.