ANDRAPRADESH, GUNTURU: సీనియర్ జర్నలిస్టు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... కొమ్మినేని శ్రీనివాసరావును మంగళవారం ఉదయం వరకూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అనంతరం ఆయన్ను గుంటూరుకు తరలించి, ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. దాదాపు గంట పాటు పరీక్షలు జరిగిన తరువాత వైద్యులు ఆయన ఆరోగ్యం సర్వసాధారణంగానే ఉందని, కేవలం స్వల్ప రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నాయని నివేదిక సమర్పించారు.
ఈ వైద్య నివేదికను మంగళగిరి కోర్టులో సమర్పించిన పోలీసులు, కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. మరోవైపు కొమ్మినేని తరఫు న్యాయవాదులు అప్పటికి ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, దాన్ని పక్కన పెట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసుకు నేపథ్యం ఏమిటంటే… అమరావతిలో మహిళలపై ఓ వ్యాఖ్యాత చేసిన తీవ్ర వ్యాఖ్యల సమయంలో, ఆ డిబేట్ను సాక్షి టీవీలో యాంకర్గా నడిపిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను అడ్డుకోలేదని, మరింత ప్రోత్సహించారని తుళ్లూరు గ్రామానికి చెందిన కంభంపాటి శిరీష్ అనే దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి మీడియా సంస్థ, ఇతర వ్యాఖ్యాతలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. కొమ్మినేని అరెస్టు పరిణామాన్ని మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నా, కొందరైతే ఆమోదిస్తున్నారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణతో కొమ్మినేని అభిమానుల్లో అసంతృప్తి నెలకొంది. కాగా, ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.