ANDRAPRADESH: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి తిరిగి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో తన కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధించారని ఆయన ఆరోపించారు. పోలీసు కేసు వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తాను 15 రోజులు దాక్కోవాల్సివచ్చిందని చెప్పారు. పగ వాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నానని పేర్ని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం సంబరాలు చేస్తుంటే.. విపక్షం ఏడాదిగా అనుభవిస్తున్న వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసీపీ నేతలను కేసుల్లో ఇరికిస్తూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలకు తీవ్ర హెచ్చరికలు పంపారు.
‘‘నా శ్రీమతిని అరెస్టు చేసేందుకు విపరీతంగా ట్రై చేశారు. ఏ పగ వాడికి కూడా ఇలా జరగకూడదు. నా భార్యను తీసుకుని రోజుకు ఒక ఇంట్లో తలదాచుకున్నా, ఇలా 15 రోజులు తిరగడం అంటే ఆ రోజే మానసికంగా చచ్చిపోవాలి. ఎవరికీ రాకూడని దుస్థితి. అద్రుష్టవశాత్తూ ముందస్తు బెయిల్ వచ్చింది. అయినా వదలకుండా జనవరి 1న నా భార్యను పోలీసుస్టేషనుకు పిలిపించి నాలుగు గంటల పాటు ఇష్టానుసారం మాట్లాడారు. రోజులు మీవి నడుస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పే రోజు.. వాతకు పది వాతలు పెట్టే రోజు వస్తుంది’’ అంటూ పేర్ని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మచిలీపట్నంలో పేర్ని కుటుంబానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని మాజీ మంత్రి పేర్ని భార్యతోపాటు ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బియ్యం విలువ మేరకు పేర్ని ప్రభుత్వానికి దాదాపు రూ.1.70 కోట్లు చెల్లించినా, ఆయనపై పౌర సరఫరాల శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పేర్ని దంపతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఈ కేసు విషయంలో అరెస్టు చేస్తారనే కారణంతో పేర్ని దంపతులు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో గడపాల్సివచ్చింది. తన రాజకీయ జీవితంలో అలాంటి నరకం ఎప్పుడూ అనుభవించలేదని పలుమార్లు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి పేర్ని.. ప్రత్యర్థులకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని ఎప్పటికప్పుడు వార్నింగులిస్తున్నారు. దీంతో బందరు రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది.