Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు


అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని డిమాండ్

అధిష్టానం ఒకరి పేరు ఖరారు చేసిందన్న ప్రచారంపై స్పందన

నావాడు, నీవాడు అంటే పార్టీకి నష్టమని వ్యాఖ్య

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర సారథిని అధిష్టానం నామినేట్ చేయడం సరికాదని, అంతర్గత ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా నావాళ్లు, నీవాళ్లు అంటూ నియామకాలు చేపడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం ఇప్పటికే ఒక వ్యక్తి పేరును ఖరారు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ తెలిపారు. ఈ పద్ధతిని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. "పార్టీ అధ్యక్షుడిని బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ముఖ్య నేతల వరకు అందరూ ఓటు వేసి ఎన్నుకోవాలి. అలా కాకుండా ఒకరిద్దరు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి" అని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యం నెరవేరాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. "నావాడు, నీవాడు అనే ధోరణితో పదవులు ఇచ్చుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే అధ్యక్ష పదవికి కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి" అని తేల్చిచెప్పారు. అధ్యక్షుడి నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కొత్త చర్చకు దారితీశాయి.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now