Hot Posts

6/recent/ticker-posts

ఏలూరులో ఘనంగా స్వర్గీయ ఎన్.టి.ఆర్. జయంతి వేడుకలు.


స్వర్గీయ డా.ఎన్.టి.రామారావు కు నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

ఏలూరు జిల్లా, ఏలూరు: పురాణపాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ స్వర్గీయ డా. ఎన్.టి.రామారావు ఉన్నరంటే ఆయన ఖ్యాతి అజరామమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొనియాడారు. 

స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా డా. ఎన్.టి.ఆర్. చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, నగరపాలక సంస్ధ కో-ఆప్షన్ మెంబర్ ఎస్.ఎం.ఆర్. పెదబాబు తదితరులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 

మాతెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభంకాగా అనంతరం స్వర్గీయ ఎన్.టి.ఆర్. జీవితచరిత్రను స్ర్ర్క్రీన్ పై ప్రదర్శించారు. తదుపరి గండికోట రాజేష్ శిష్యబృందం లవకుశ సినిమాలో శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం అంశాలపై ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను ప్రత్యేకంగా తిలకించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి నృత్యప్రదర్శన చేసిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు.  

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్. జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పిన ఎన్.టి.ఆర్. తెలుగు ప్రజల హృదయాల్లో స్ధిరస్ధాయిగా నిలిచిపోయారన్నారు. ఎన్.టి.ఆర్. అంటే అందరూ ఒక కళాకారుడు అని అనుకుంటారని, నేనుకూడా మా తండ్రిగారి ద్వారా ఎన్.టి.ఆర్. సినిమాలు చూసి చాలా స్పూర్తి పొందానన్నారు. కర్ణ సినిమాలో కృష్టుడిపై కర్ణుడు పాడిన పాట మానాన్నగారికి చాలా ఇష్టమని ఆ పాటను మా తండ్రిగారి ద్వారా చూసి నేను ఎంతో స్పూర్తి పొందానన్నారు. 

పురాణపాత్రల్లో నటించి ప్రజల గుండెల్లో దేవుడిగా ఇప్పటికీ ఉన్నారంటే ఆయన ఖ్యాతి అజరామమని కొనియాడారు. స్వర్గీయ డా. ఎన్.టి.రామారావు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు. వారు ప్రవేశపెట్టిన పధకాలు ఇప్పటికీ పాటించడం జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఎన్.టి.ఆర్. ఒక అద్బుతమైన నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఈనాడు మన మద్య లేకున్నా ప్రజల్లో ఎంత గొప్ప అభిమానం ఉందనే విషయం ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూస్తే ఎంతో ఆశ్ఛర్యానికి లోనైనాన్నారు.  

అటువంటి ఘనమైన నాయకునికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. తాను 10 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేసిన సందర్బంలో ఎదో ఒక సందర్బంలో ఆయన పేరు వింటూ వారుచేసిన మంచిపనులు ప్రజలు చెప్పుకోవడం ద్వారా వారు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. స్వర్గీయ ఎన్.టి.ఆర్. మహిళా సాధికారతకు, మహిళలకు ఆస్ధిలో సమానహక్కు, రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కాఇళ్లు, స్ధానిక సంస్ధలను బలోపేతం వంటి కార్యక్రమాలకు ఎన్.టి.ఆర్. శ్రీకారం చుట్టారన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిదిలో భక్తులకోసం అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అన్నారు.

విశ్రాంత రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమయపాలన, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు స్వర్గీయ ఎన్.టి.ఆర్. అని పేర్కొన్నారు. తెలుగునేల తెలుగుజాతి ఉన్నంతవరకు తరతరాలుగా గుర్తిండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయనసొంతం అన్నారు. ఎన్.టి.ఆర్. శ్వాస, ద్యాస, ఘోష, తెలుగు అక్షర సేధ్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు.

శ్రీ శ్రీ విద్యాసంస్ధల అధినేత ఎం.బి.ఎస్. శర్మ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమరాజ్యం సృష్టించి సమ సమాజ నిర్మాతగా లౌకిక వాదిగా నందమూరి తారకరామారావు పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధృవతారగా వెలుగొంది తన నటనా కౌశల్యంతో 300 లకు పైగా చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా ప్రజల మనస్సులను దోచుకున్నారన్నారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాకుండా రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడా లాంటి ప్రతి నాయక పాత్రలు పోషించి ఆయా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి జీవం పోశారన్నారు. సుమారు 65 పౌరాణిక, 45 జానపద చిత్రాలలో నటించారన్నారు. తెలుగుజాతి యావత్తు ప్రేమగా అన్నా అని పిలుచుకునే ఏకైక వ్యక్తి ఎన్.టి.ఆర్. అని ఆయన వ్యక్తికాదు మహాశక్తి అని ఆయన పేర్కొన్నారు. 

వై. ఆనందనాయుడు మాట్లాడుతూ తెలుగు వారికి, మన రాష్ట్రానికి ఎన్.టి.ఆర్. ఒక గుర్తింపు తెచ్చారన్నారు. స్వర్గీయ ఎన్.టి.ఆర్. గురించి చెప్పుకోవాలంటే ఈ జన్మ సరిపోదని కొనియాడారు. బి.సి. లకు పట్టం కట్టిన జననేత స్వర్గీయ ఎన్.టి.ఆర్. అని పేర్కొన్నారు. ప్రజానాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్.టి.ఆర్. స్ధానం సుస్తిరం ఆయన అందుకే ఆ మహానుబావుడికి భారతరత్న ఇవ్వాలని తెలుగుజాతి కోరుకుంటుందన్నారు.

ఎన్.టి.ఆర్. చరిత్రపై ఫోటో ప్రదర్శన..
స్వర్గీయ ఎన్.టి.ఆర్. జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తోపాటు కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, అధికారులు తిలకించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్ధ కో-ఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ కార్పోరేటర్ చోడే వెంకటరత్నం, సెట్ వెల్ మేనేజరు సత్యనారాయణ, పర్యాటక శాఖ జిల్లా మేనేజరు పట్టాభి, వివిధ శాఖలజిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.