Hot Posts

6/recent/ticker-posts

తెనాలిలో రోడ్డుపై యువకులకు లాఠీ దెబ్బలు.. ఆయనపై హత్యాయత్నం, ఎస్పీ కీలక ప్రకటన


ANDRAPRADESH, GUNTURU, TENALI: గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ అంశంపై గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ స్పందించారు.. ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యువకులపై దాడి ఘటనకు ముందు ఏం జరిగింది.. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి, హత్యాయత్నం వంటి అంశాలపై ఎస్పీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెనాలిలో ఏం జరిగిందో ఎస్పీ వివరణ ఇచ్చారు.


'ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలి.. 26.05.2025న సామాజిక మాధ్యమాల ద్వారా తెనాలి పోలీస్ వారు ముగ్గురు యువకులను కొట్టే దృశ్యాలు ప్రసారం కావడం జరిగింది. సదరు దృశ్యాన్ని పరిశీలించగా గత నెలలో జరిగినట్లుగా మా దృష్టికి వచ్చినది.విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై గంజాయి మత్తులో దాడికి పాల్పడినారని తెలిసింది. అది ఆమోదయోగ్యమైంది కాదు మరియు ఖండించదగినది. జరిగిన సంఘటన గురించి ప్రాధమికంగా విచారించగా వేము నవీన్ అలియాస్ కిల్లర్, చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ కరీముల్లా అను నలుగురు వ్యక్తులు తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతా నగర్ నందు గంజాయి తాగుతూ దానికి బానిసలుగా మారి సామాన్య ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ ఉంటున్నారు' అని తెలిపారు.

'ఈ క్రమంలో తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ తెనాలి 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో అతనినీ అడ్డగించి అప్పటికే గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు అతనిపై అకస్మాత్తుగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ఘటనపై నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగినది. వీరిపై అప్పటికే తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రౌడీషీట్స్ కూడా నమోదై ఉన్నాయి. ఆ వ్యక్తులు గంజాయి, హత్యాయత్నం, దోపిడి, కొట్లాటలు, దొంగతనాలు, ఆడవారిపై దాడి చేయడం వంటి పలు కేసులలో నిందితులుగా ఉంటూ, జైలు కూడా వెళ్లి రావడం జరిగింది' అన్నారు.

'1) వేము నవీన్ @ కిల్లర్ పై 10 కేసులు... 2) చేబ్రోలు జాన్ విక్టర్ పై 10 కేసులు.. 3) దోమ రాకేష్ పై 09 కేసులు.. వీరందరూ తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లుగా ఉన్నారు. నేర చరిత్ర కలిగి రౌడీ షీటర్లుగా ఉంటూ విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్‌పై దాడిచేయడం ఎంతో అమానుషం. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసు శాఖలో పనిచేసే కానిస్టేబుల్ పై దాడి చేశారంటే సామాన్యులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేయడమే వారి ఉద్దేశంగా అనిపించింది' అంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటనలో తెలిపారు.