Hot Posts

6/recent/ticker-posts

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలి: జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి


ఏలూరు జిల్లా, ఏలూరు :  యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా తగ్గించేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 'నాషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమాలపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం  స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం  జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. 


ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, జిల్లాలో యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలలో మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు.   

జూన్, 26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్భంగా జూన్, 1వ తేదీ నుండి జూన్, 26వ తేదీ వరకు మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై  విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్,1వ తేదీ న ప్రజలతో 'వాకధాన్'  వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, సమాజంలోని వివిధ వర్గాలవారితో క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. జూన్,26వ తేదీన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం నివారణ దినోత్సవం సందర్బంగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  
మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ఫిర్యాదు చేయదలుచుకున్నవారు  1972 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన  వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.  1972 టోల్ ఫ్రీ నెంబర్ ను జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన సెంటర్లలో ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలన్నారు. జిల్లాలోని అన్ని మెడికల్ షాపులలోనూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నార్కోటిక్ మందులు అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  

గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా పై ప్రత్యేక నిఘా పెట్టాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై కఠినమైన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలన్నారు.   జిల్లాను  మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, ప్రజలను ప్రధాన భాగస్వాములను చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలు, 1972 టోల్ ఫ్రీ నెంబర్ , తదితర ప్రచార స్టిక్కర్లను ఆవిష్కరించారు.  

సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు,  విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి. రామ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, ఎస్పీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి, డిఎస్డిఓ శ్రీనివాసరావు,  పోలీస్, ఐసిడిఎస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ,  తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.