ANRAPRADESH, GUMYURU, TENALI: బహిరంగ పోలీసు దండనలపై సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు అనేక తీర్పులు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో.. ప్రజలు సంచరించే ప్రాంతాల్లో పట్టుబట్టి పోలీసులు దండన చేయడం.. చట్ట విరుద్ధమని.. ఐపీసీలోని ఏ సెక్షన్ ప్రకారం.. వారికి ఆ అధికారం ఉందని కూడా.. గతంలో ఏపీ హైకోర్టు రెండు సార్లు పోలీసులను ప్రశ్నించింది. అయితే.. పోలీసులు నాడు వైసీపీ ప్రభుత్వ మెప్పుకోసం.. బరితెగిస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు మెప్పుకోసం.. మరో అడుగు ముందుకు వేశారనే విమర్శలుముసురుకుంటున్నాయి.
తాజాగా గుంటూరు జిల్లా తెనాలి పోలీసులపై ప్రజాసంఘాలు, ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ముగ్గురు యువకులను నడిరోడ్డుపై కూర్చోబెట్టి ఇష్టానుసారంగా చితకబాదారు పోలీసులు. గతంలో తెలంగాణలోని ఖమ్మంలోనూ ఇదే జరిగితే.. అప్పటి పోలీసులపు కేసీఆర్ ప్రభుత్వం సస్పెండ్ చేయాల్సి వచ్చింది. అది కూడా హైకోర్టు జోక్యంతో కఠిన చర్యలకు దిగాల్సి వచ్చింది. ఇక, వైసీపీ హయాంలోనూ అనంతపురం పోలీసులు ఇలానే చేస్తే.. అప్పుడు కూడా ఇదే చర్యలకు ఉపక్రమించేలా హైకోర్టు ఆదేశించింది.
అయినా.. పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఘటనలో తాము రౌడీ షీటర్ అనుచరులకు `కౌన్సిలింగ్` ఇచ్చామని పోలీసులు కలరింగ్ ఇస్తున్నా.. ప్రస్తుతం జరిగిన `లాఠీ కరాళ` నృత్యం వారికి మెప్పు తీసుకురాకపోగా.. రాష్ట్రంలో పోలీసుల తీరుపై ప్రభుత్వానికి ముప్పు వచ్చేలా చేసింది. ఇటీవలే.. రాష్ట్ర హైకోర్టు .. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు మీరు చెప్పినట్టు వింటున్నారా? చట్టం చెప్పినట్టు చేస్తున్నారా? అని నిలదీసింది. ఈ వేడి చల్లారక ముందే.. పోలీసులు తాజాగా రెచ్చిపోయారు.
ఇక, దీని వెనుక రెండు వాదనలు వినిపిస్తున్నాయి.
1) తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. నెల రోజులక్రితం ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేసిన రౌడీషీటర్ లడ్డూ అనుచరులు విక్టర్ , బాబూలాల్, రాకేష్లను నడిరోడ్డుపై చితకబాదారు.
2) కానీ.. రెండో విషయానికి వస్తే.. విక్టర్ , బాబూ లాల్, రాకేష్లను ఓ కేసులో కానిస్టేబుల్ లంచాలు డిమాండ్ చేశాడని.. అవి ఇవ్వకపోవడంతోనే తనపై దాడికి దిగారని ఆయన కేసు పెట్టినట్టు బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. కట్ చేస్తే.. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వీడియోపై.. ప్రతిపక్షాలు సహా.. న్యాయ నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై హైకోర్టుకు వెళ్తామని ప్రముఖ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యవహారంపై డీజీపీ కూడా విచారణకు ఆదేశించారు. మరి పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో కానీ.. ప్రభుత్వానికి మాత్రం ముప్పు తెస్తున్నారు.