Hot Posts

6/recent/ticker-posts

'భళా మనవడా.. భళా'.. మహానాడులో ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ వేరే లెవెల్!


ANDRAPRADESH, KADAPA:కడప వేదికగా టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహానాడు వేదికపై.. టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా... ఎన్టీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ స్పీచ్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... "మహా వేడుకలా, నింగి నేలా పసుపు మయమై పరవశించేలా, అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు, ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపాకాలకు వెలుగొందుతున్న మన బిడ్డల.. వివిధ రంగాల్లో తమ ప్రతిభాపాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య నీరాజనం ఇచ్చిన కళాకారులకు మేధావులకు, విజ్ఞులకు, ముఖ్యంగా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న టీడీపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి" అంటూ ఏఐ ఎన్టీఆర్ స్పీచ్ మొదలైంది.

ఇదే సమయంలో.. "సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలవడం కోసం.. తెలుగుదేశం పార్టీని స్థాపించి" అని ఏఐ ఎన్టీఆర్ గుర్తుచేశారు. "నేను స్థాపించాను అనే కంటే.. పుట్టింది అని చెప్పడమే సరైంది" అని అన్నారు. పార్టీ ఆవిర్భవించిన నాడు ప్రారంభించిన పథకాలు, నేడు చంద్రబాబు నేతృత్వంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు ఏఐ ఎన్టీఆర్.

ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ప్రస్థావన తీసుకొచ్చారు ఏఐ ఎన్టీఆర్. ఇందులో భాగంగా.. మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది.. నా వారసత్వానికి వన్నె తెస్తున్నాడు లోకేష్.. ఇది చూసిభళా మనవడా.. భళా అంటూ మురిసిపోతుంది నా మనసు" అంటూ సాగింది ఏఐ ఎన్టీఆర్ ప్రసంగం.