విద్యార్ధుల అవసరాలకు అనుగుణంగా పనులు
రూ.5.73 కోట్లతో చేపట్టిన 52 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అభివృద్ధి పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో రూ.5.73 కోట్లతో చేపట్టిన సోషల్ వెల్ఫేల్ హాస్టల్స్ అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హాస్టల్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సోషల్ వెల్ఫేర్ అధికారులు, పంచాయితీరాజ్, సమగ్రశిక్ష, ఆర్ అండ్ బి , పబ్లిక్ హెల్త్, ఎపిఇడబ్ల్యూఐడిసి ఇంజనీర్లతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హాస్టల్స్ లో విద్యార్ధులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. అన్ని హాస్టల్స్ లో రన్నింగ్ వాటర్, టాయిలెట్లు, బాత్ రూమ్స్ లకు తలుపులతో మరమ్మతు పనులు పూర్తిచేయాలన్నారు. వేసవి సెలవులు అనంతరం హాస్టల్స్ తెరిచేనాటికి పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తిచేయాలన్నారు.
సంబంధిత పనులు విద్యార్ధుల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, సంబంధిత సంక్షేమ హాస్టల్స్ అధికారులు పనుల నాణ్యతను పరిశీలించాలన్నారు. శిథిలావస్ధలోవున్నట్లు గుర్తించిన 8 సంక్షేమ హాస్టల్స్ విషయంలో భవనాలు తొలగించడం, నూతన హాస్టల్స్ నిర్మాణానికి ప్రతిపాధనలు సిద్దంచేసి సమర్పించాలన్నారు. ఇంకా హాస్టల్స్ లో చేపట్టవలసిన అత్యవసర పనులను గుర్తించి అంచనాలతో జాబితాను సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఇన్ చార్జి జాయింట్ డైరెక్టర్ ఎం. ముక్కంటి, పంచాయితీరాజ్, సమగ్రశిక్ష, ఆర్ అండ్ బి , పబ్లిక్ హెల్త్, ఎపిఇడబ్ల్యూఐడిసి ఇంజనీర్లు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.