Hot Posts

6/recent/ticker-posts

అత్యాశకు పోతే చివరకు మిగిలేది మోసమే.. రూ.12 కోట్లతో పరార్


ANDRAPRADESH, KADAPA: అత్యాశ, మోసం చాలా దగ్గర ఉంటాయి. కష్టపడిన దానికి ప్రతిఫలం ఆశించడం ఆశ.. కష్టపడకుండానే కోట్లు రావాలనుకోవటం అత్యాశ. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే.. కుచ్చుటోపీ మీ తలపై ఉండటం ఖాయం. అదేంటనుకుంటున్నారా.. అదే మోసం. అత్యాశకు పోతే చివరకు మిగిలేది మోసమేనని దీని సారాంశం. షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. 


షేర్ మార్కెట్ పేరుతో ఓ వ్యక్తి 30 మందికి కుచ్చుటోపీ పెట్టాడు. రూ.10 లక్షలు ఇస్తే నెలకూ రూ.40 వేలు ఇస్తామంటూ ఆశచూపించాడు. అలా 30 మందితో రూ.12 కోట్ల వరకూ వసూలు చేశాడు. చివరకు ఆ డబ్బులతో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్ పేరుతో తమను మోసం చేశాడంటూ 30 మంది బాధితులు రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లాభాలు వస్తాయంటూ తమను నమ్మించాడని.. రూ.10 లక్షలు చెల్లిస్తే.. నెలకు రూ.40 వేలు చొప్పున తిరిగి చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అలా డబ్బులు వసూలు చేశారని.. తిరిగి అడిగితే బెదిరింపులకు దిగారని ఆరోపించారు. 

తీరా ఇప్పుడు పరారయ్యాడని.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ట్రేడింగ్, షేర్ మార్కెట్ పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో నిపుణులు పలు జాగ్రత్తలు చెప్తున్నారు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే నమ్మదగిన బ్రోకర్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ బ్రోకర్లు లేదా ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని.. వారి రిజిస్ట్రేషన్ వివరాలను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అలాగే తక్కువ సమయంలో రెట్టింపు లాభం వంటి హామీలను నమ్మవద్దని చెప్త్తున్నారు. 

ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో దాని ఆర్థిక స్థితి, మార్కెట్ పనితీరు,నిర్వహణ గురించి సమాచారం సేకరించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌లలో లాభం గ్యారంటీ అని చెప్పే ప్రకటనలు నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏదైనా స్కీమ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో చేరే ముందు షరతులు, నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకోవాలని జాగ్రత్తలు చెప్తున్నారు.