ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 18: ఉంగుటూరు మండలం బాదంపూడి లోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి. రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలోని వారికీ, మత్స్యకారులు, యువకులు, జాలరులు సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకం నందు ఆసక్తి కలిగిన ఇతరులు, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులన్నారు.
ఉపకార వేతనములు లేకుండా 20 సీట్లు ఉన్నయని, దరఖాస్తుదారులకు ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలోని మత్స్య శాఖ సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరపబడునని, ఎంపికైన వారి పేర్లు అదేరోజు సాయంత్రం 4 గంటల తరువాత కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. శిక్షణా కాలం మే, 1వ తేదీ నుండి జులై,31 వ తేదీ వరకు మూడు నెలలపాటు ఉంటుందన్నారు.
శిక్షణా కాలంలో మత్స్య క్షేత్రములు మరియు రిజర్వాయిర్లలో చేపల పెంపకం గురించి బోధనా, మరియు ప్రాక్టికల్స్ తో కూడిన కోర్స్ బోధించడం జరుగుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. 5వ తరగతి ఆపైనచదువుకుని, తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, వయస్సు 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. సహాయ పరిశీలకులు, మత్స్య శాఖ హోదాకు తగ్గకుండా మత్స్య శాఖ అధికార్ల నుండి పొందిన అనుభవం సర్టిఫికెట్లు దరఖాస్తుతో జతపరిచి పంపాలన్నారు.
పూర్తి బయో డేటా వివరాలతో దరఖాస్తును ఈ నెల 23వ తేదీ లోగా సహాయ సంచాలకులు, మత్స్య శాఖ, బాదంపూడి, ఉంగుటూరు మండలం వారికి పంపాలన్నారు. ఇంటర్వ్యూ హాజరు అయ్యే వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని ఆయన తెలియజేసారు. ఇతర వివరాలకు మత్స్య సహాయ సంచలకులు, బాదంపూడి ( సెల్ నెంబర్ 9573337484) లేదా మత్స్య శాఖ అధికారి, బాదంపూడి-1 (సెల్ నెంబర్ 7286993033) వారిని లేదా మత్స్య శాఖ అధికారి, బాదంపూడి- 2 (సెల్ నెంబర్ 9492337649 ) వారిని కార్యాలయ పనివేళలలో సంప్రతించాలన్నారు.


