HYDERABAD:పార్టీలో వివాదాల పైన సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే పర్యటన తరువాత రేవంత్ పార్టీ - పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. పార్టీలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న వివాదాల పైన పార్టీ అధినాయకత్వం ఆరా తీసింది. వివాదాలకు కారణం అవుతున్న నేతల పట్ల కఠినంగా ఉండాలని నిర్దేశించింది. ఈ క్రమంలో కొండా సురేఖ తో తాజాగా సీఎం రేవంత్ తాజా వివాదాల పై చర్చించారు. పరిస్థితిలో మార్పు రావాలని తేల్చి చెప్పారు. ఇక, పార్టీ క్రమశిక్షణా సంఘం 10న జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లా పార్టీ నేతల వివాదం పై రేవంత్ ఫోకస్ చేసారు. పరిష్కారం కోసం నేరుగా రంగం లోకి దిగారు. మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుష్మితాపటేల్లను తన నివాసానికి పిలిపించు కుని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో బాధ్యత గల నాయకులు అయ్యుండి.. పార్టీ అంతర్గత వేదిక లపై మాట్లాడాల్సిన అంశాలను బహిరంగంగా ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి బలమైన నాయకుల అవసరమేనని, అయితే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమేనని రేవంత్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్ఠానం వరకు వెళ్లిందని, ఇక మీదట సంయమనంతో వ్యవహరించాలని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం.
కాగా.. కొండా మురళి వ్యాఖ్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ సోమవారం గాంధీభవన్లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ సమావేశం వాయిదా పడినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. వరంగల్ కార్పొరేషన్ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి ఉన్నందున భేటీని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.
ఇప్పటికే కొండా దంపతుల వ్యవహారం పై హైదరాబాద్ కు వచ్చిన పార్టీ అగ్రనాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ - ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు. ఇప్పటికే కొండా మురళీ నుంచి వివరణ తీసుకున్నారు. జిల్లా నేతలతోనూ చర్చలు చేసారు. ఇక, ఇలాంటివి తిరిగి చోటు చేసుకో కుండా టీపీసీసీ కఠిన చర్యలకు సిద్దం అవుతుందనే ప్రచారం వేళ.. తీసుకునే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi