ANDHRAPRADESH:ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న లిక్కర్ స్కాంపై పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంపై ఇప్పటివరకూ పెద్దగా మాట్లాడని షర్మిల.. ఇవాళ మాత్రం సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ స్కాంలో చంద్రబాబు ప్రభుత్వం సిట్ తో చేయిస్తున్న దర్యాప్తు కొన్ని అంశాలకే పరిమితమైందని షర్మిల ఆరోపించారు. లిక్కర్ స్కాం లో సిట్ విచారణ కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందంటూ వ్యాఖ్యానించారు.
మద్యం స్కాంలో దర్యాప్తు అంతా డిస్టిలరీల చుట్టే సాగుతుందని షర్మిల ఆక్షేపించారు. ఈ స్కాం వెనుక కమీషన్లు మాత్రమే చూపుతున్నారని, కమీషన్ల కోసం డిస్ట్రిలరీలను బెదిరించారని చెప్తున్నారని, - డెన్ లు ఉన్నాయని, కిక్ బ్యాగ్స్ అందాయని, నెలకు 50 నుంచి 60 కోట్లు అందాయని అంటున్నారని, స్కాం ఇంతకే పరిమితం కాదని షర్మిల తెలిపారు. లిక్కర్ స్కాం లో 3500 కోట్లు మాత్రమే కాదని, డిస్టిలరిల దగ్గర నుంచి కన్జ్యుమర్ వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమేనని తెలిపారు.
లిక్కర్ స్కాంలో ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి జరిగిందన్నారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అన్నారు. డిజిటల్ పేమెంట్స్ ఉండాలని చెప్పే ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం బహుశా ఎక్కడా జరగలేదన్నారు. ఏపీ లిక్కర్ స్కాం ఆర్థిక నేరమని, ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది అనధికార అమ్మకాల కోసమేనని ఆరోపించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను భారీగా అమ్మారని ఆక్షేపించారు. అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారన్నారు.
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ స్కాం మీద శ్వేతపత్రం ఇచ్చారని, లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయన్నారని గుర్తుచేశారు. 99 వేల కోట్లు ఎక్కడ పోయాయో తెలియదని చెప్పారన్నారు. ఒక్క శాతం కూడా లిక్కర్ సొమ్ము ప్రభుత్వానికి రాలేదని చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలపై విచారణ జరపాల్సి ఉందన్నారు.లక్ష కోట్ల లిక్కర్ స్కాం పై నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. వైసీపీ హయంలో ట్రస్టెడ్ లిక్కర్ అమ్మలేదని, హానికరమైన మద్యాన్ని అమ్మారని గుర్తుచేశారు.
హానికర మద్యాన్ని ప్రోత్సహించారని, అటువంటి కంపెనీలకే అనుమతులు ఇచ్చారని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్నీ,లివర్ సమస్యలు వచ్చాయని కూటమి ప్రభుత్వం చెప్పిందని, హానికరమైన మద్యాన్ని తాగి 30 వేల మంది వరకు చనిపోయారని చెప్పిందని గుర్తుచేశారు. లక్షల మందికి నరాల బలహీనత సమస్యలు వచ్చాయని మీరు నియమించిన కమిటీలు రిపోర్ట్ ఇచ్చాయన్నారు. ఈ అంశంపై కూడా దర్యాప్తు జరగాలన్నారు. క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మకాలు చేశారో విచారణ జరగాలన్నారు.
విశ్వసనీయ కంపెనీ ల మద్యాన్ని ఎందుకు నిషేధించారో విచారణ జరగాలన్నారు. బ్రాండెడ్ మద్యం కాదని నాసిరకం మద్యాన్ని ఎందుకు అనుమతించారని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. డిజిటల్ పద్ధతిలో కాకుండా ఓన్లీ క్యాష్ పై ఎందుకు అమ్మారన్నారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎందుకు అమ్మారని అడిగారు. జగన్ కి అవసరం అయిన వాటిని మాత్రమే సమాధానం చెప్తారని, ఆయనకు హాని అనుకున్నవి మాత్రం నోరు విప్పరన్నారు.
రుషికొండ ను ఎందుకు గొరిగారో చెప్పలేదని, వివేకా హత్య విషయంలో సాక్షి గుండెపోటు అని చెప్తే దానికి సమాధానం చెప్పలేదని, రక్తపు మడుగులో వివేక హత్య జరిగితే హార్ట్ ఎటాక్ అని కథలు అల్లారని గుర్తుచేశారు. జలయజ్ఞం ప్రాజెక్ట్ లు ఎందుకు పూర్తి చేయలేదు అంటే సమాధానం చెప్పలేదన్నారు. గంగవరం పోర్ట్ ను అదానీ కి ఎందుకు అప్పజెప్పారో సమాధానం లేదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించిన పాపంపై సమాధానం లేదన్నారు. సమాధానం చెప్పాల్సిన పాయింట్ ను పక్కన పెట్టీ చుట్టూ ఉన్న అంశాలు మాట్లాడటం జగన్ కి అలవాటు అన్నారు.
జగన్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలన్నారు. విచారణను బట్టి ఏం నిర్ణయం తీసుకుంటున్నారో చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కి బి టీమ్ అవ్వాల్సిన అవసరం లేదని, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే బీజేపీ కి బి టీమ్ అన్నారు. - అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీ కి జగన్ దత్తపుత్రుడు అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ ఎంపీలు ఈనాటికి మోడీకి మద్దతు ఇస్తున్నారని, ఈ రాష్ట్రంలో బాబు,జగన్,పవన్ ముగ్గురు బీజేపీకి తొత్తులు ఆని షర్మిల ఆరోపించారు.