ANDHRAPRADESH:డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో వైసీపీ హయాంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు.
గురువారం ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే బండారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛను మొత్తాన్ని ₹1000 పెంచాలంటే జగన్ కు ఐదేళ్లు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిందని ఆయన అన్నారు.
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లతో పాటు తల్లికి వందనం, త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు వంటి ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.