Hot Posts

6/recent/ticker-posts

నేడు మరోసారి ఆసుపత్రికి వెళ్లనున్న కేసీఆర్


జ్వరం తగ్గడంతో వైద్యుల సూచన మేరకు ఫాలో-అప్ చెకప్

గత ఐదు రోజులుగా నందినగర్‌లోని నివాసంలోనే విశ్రాంతి

విశ్రాంతి సమయంలోనూ పార్టీ నేతలతో కీలక సమావేశాలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడి కోలుకున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

గత ఐదు రోజులుగా కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసానికే పరిమితమై పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన పార్టీ కార్యకలాపాలను సమీక్షించడం ఆపలేదు. ఈ విశ్రాంతి సమయంలోనే పార్టీ కీలక నేతలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పార్టీ సన్నద్ధతపై ఆరా తీసి, నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎదురయ్యే నష్టాలపై కూడా కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వారికి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. మరోవైపు, వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi