ANDRAPRADESH: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈజీనేనని.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో కేంద్రం నుంచి తాజా ప్రతిపాదనకు ఓకే చెబితే.. ఇక, రాష్ట్రంలో తమ్ముళ్లకు మరో ఆదాయ మార్గం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉచిత ఇసుక, మద్యం, మట్టి వంటి ద్వారా పైకి ఎన్ని చెప్పినా.. అంతర్గతంగా వ్యాపారాలు చేస్తున్నది కూటమి పార్టీల నాయకులే.
ఈ విషయం బహిరంగ రహస్యమే కూడా. దీనిని ఇటీవల మహానాడు వేదికగా కూడా.. చర్చించడం మరో విశేషం. మీరు చేసుకునే వ్యాపారాలు.. వ్యవహారాల జోలికి రావడం లేదని.. అయితే.. అవి ప్రజలు మెచ్చేలా ఉండాలని మాత్రం పార్టీ అధినేత సూచించారు. ఇదిలావుంటే.. తాజాగా ఫైబర్ నెట్ను కూడా.. ఇప్పుడు ప్రభుత్వం తన పరిధి నుంచి తప్పించే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి.. వడివడిగా నిర్ణయాలు తీసుకుని కేంద్రానికి లేఖలు కూడా రాసేసింది.
ఇప్పటి వరకు ఫైబర్ నెట్.. ప్రభుత్వ అధీనంలో ఉంది. అంటే.. ప్రభుత్వమే దీనిని నిర్వహిస్తోంది. ప్రజల నుంచి నెలకు 150, 250 చొప్పున వసూలు చేసి.. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు.. ఫైబర్ నెట్ సేవలను అందిస్తోంది. తద్వారా ప్రజలకు కొంత తక్కువ ధరలకే టీవీ చానెళ్లు, ఇంటర్ నెట్, ఫోన్ సదుపాయం వంటివి అందుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రైవేటుకు ఇచ్చేయాలని.. సర్కారు నిర్ణయించింది.
అంటే.. దీనిని నియోజకవర్గాల వారీగా కాంట్రాక్టు పద్దతిలో వ్యక్తులకు, సంస్థలకు అప్పగించనున్నారు. అయితే.. వస్తువులు, సామగ్రి మాత్రం ప్రభుత్వమే ఇస్తుంది. కేవలం నిర్వహణను మాత్రమే ప్రైవేటుకు అప్పగిస్తారు. తద్వారా.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ కాంట్రాక్టులు దాదాపు ప్రభుత్వంలోని పార్టీలకు చెందిన నాయకులు దక్కించుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇది ఒక రకంగా వారికి అందిస్తున్న మరో అవకాశంగా చెబుతున్నారు. మరి దీనిని న్యాయబద్ధంగా వినియోగించుకుంటే మంచిదే.. కానీ.. తేడా వస్తే.. సర్కారుకే ముప్పు అంటున్నారు పరిశీలకులు.