ANDRAPRADESH: ఏపీ రాజధాని అమరావతిని `వేశ్యల రాజధాని`గా అభివర్ణించి.. పెను దుమారానికి కారణమైన సీనియర్ జర్నలిస్టు ఆర్వీవీ కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి మీడియా చానెల్లో ఈ నెల 6న ఉదయం నిర్వహించిన ఓ చర్చలో ఆయన అమరావతిపై మాట్లాడుతూ.. అది దేవతల రాజధాని కాదన్నారు. దేవతల రాజధాని అంటే.. స్వర్గంలో ఉంటుందని.. కానీ, ఇక్కడున్న వేశ్యల రాజధాని అని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సమయంలో చర్చకు నేతృత్వం వహించిన సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా ఇన్ పుట్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు సైతం.. ఈయన వ్యాఖ్యలను తప్పుబట్టలేదు.
పైగా.. ``నేను కూడా చూశాను.. నేను కూడా చదవివాను..`` అంటూ కృష్ణంరాజు చెప్పిన ఓ ఆంగ్ల మీడియా కథనంపై సమర్థింపు ధోరణిలో కొమ్మినేని వ్యాఖ్యానించారు. ఆ మర్నాడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళలు ఆగ్రహంతో రగిలి పోయారు. నిరసనలు, ఆందోళనలను చేపట్టారు. ఏపీలో సాక్షి మీడియా హౌస్ల ముందు ఆందోళనలు చేశారు. సాక్షి పేరును తొలగించారు. పేపర్లను తగుల బెట్టారు. సాక్షి చైర్ పర్సన్ భారతి, మాజీ సీఎం జగన్లు క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేసమయంలో కొమ్మినేని, కృష్ణంరాజులను అరెస్టుచేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన ఎస్సీ మహిళ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేశారు. అయితే.. ఈ విషయం తెలిసిన వెంటనే కృష్ణంరాజు విజయవాడలోని తన ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. ఆయన కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇంతలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. అయితే.. గాలింపును ముమ్మరం చేసిన పోలీసులు.. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయనను ఎక్కడ ఉన్నదీ తెలుసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం కృష్ణంరాజును బుధవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆయన వివాదానికి దిగినట్టు తెలిసింది. దీంతో కేసు పూర్వాపరాలను వెల్ల డించిన పోలీసులు.. సహకరించకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ఆయన అరెస్టుకు అంగీకరించినట్టు తెలిసింది. తుళ్లూరు పోలీసులు శ్రీకాకుళంలో అరెస్టు చేసి.. ఆయనను గుంటూరుకు తరలిస్తున్నారు.