Hot Posts

6/recent/ticker-posts

ఇసుక పంపిణీ విషయంలో వారు చెబుతున్న లెక్కలు మరీ దారుణం


ANDRAPRADESH: చంద్రబాబునాయుడు సర్కారు కొలువు తీరి ఏడాది పూర్తి కాబోతోంది. ఇన్నాళ్లలో ఈ ప్రభుత్వం ఏం పనిచేసింది? ఎంత పనిచేయలేదు? ఎన్ని హామీల విషయంలో మడమ తిప్పేసింది. కీలకమైన ఎన్ని హామీలను అసలు పట్టించుకోకుండా గాలికొదిలేసి ప్రజలను వంచించింది.. అనే చర్చప్రజల్లో జరగడం చాలా సహజం.

ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి.. ప్రభుత్వ వైఫల్యాలు పెద్దగా కనిపించకుండా.. వాటిని చిన్నవి చేసి చూపించడానికి పచ్చమీడియా అప్పుడే తన కుటిల యత్నాలు ప్రారంభించింది. ప్రత్యేకించి ఇసుక పంపిణీ విషయంలో వారు చెబుతున్న లెక్కలు మరీ దారుణంగా ఉంటున్నాయి. వాస్తవానికి దూరంగా కూడా ఉంటున్నాయి.

జగన్ ప్రభుత్వం అప్పట్లో కొత్త ఇసుక విధానం తెచ్చి విక్రయించింది. ఇసుక అమ్మిన డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. అయితే పారదర్శకత గురించి పట్టించుకోకుండా.. కేవలం నగదు చెల్లింపుల ద్వారా మాత్రమే విక్రయించడం, డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని బూచిగా చూపిస్తూ ప్రచారం చేసి కూటమి పార్టీలు నెగ్గి అధికారంలోకి వచ్చాయి.

చంద్రబాబునాయుడు ఎన్నికల హామీ ప్రకటించినట్టుగా ఉచిత ఇసుక ఇస్తున్నట్టుగా హైడ్రామా నడిపించారు. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక ఉచితంగా లభిస్తున్న పరిస్థితి మాత్రం లేదు. కొనదలచుకున్న వారు.. స్థానిక తెలుగుదేశం నాయకులకు కప్పం కట్టవలసి వస్తోంది. ఇసుక ముసుగులో ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు. చాలా చోట్ల వైసీపీ పాలనలో ధరకంటె ట్రాక్టరు ఇసుక ఎక్కువ పలుకుతోందంటే అతిశయోక్తి కాదు.

కానీ ఈ విషయంలో పచ్చమీడియా ప్రచారం ఇంకో రకంగా ఉంది. ఒకవైపు వారు- ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా ఉచిత ఇసుక విధానం అమలవుతున్నదంటూ ప్రభుత్వానికి డప్పు కొడుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే.. ఒక టిప్పరు ఇసుక ధర సగానికి తగ్గిందని అంటున్నారు.

గత ప్రభుత్వంలో రీచ్ లో టన్ను రూ.475కు అమ్మేవారని, ఇప్పుడు తవ్వకాలు, నిర్వహణ ఖర్చుల కింద సగటున గరిష్టంగా రూ.100 తీసుకుంటున్నారని అంటున్నారు. అంత తేడా ఉన్నప్పుడు గతంలో కంటె అయిదో వంతు ధరకే ఇసుక దొరకాలి కదా? మరి, టిప్పరు ఇసుక గతంలో కంటె సగమే ఎలా తగ్గింది? అనేది ప్రజల సందేహం.

రీచ్ ల వద్ద అధికారికంగా వసూలు చేస్తున్న మొత్తం తక్కువే అయినప్పటికీ.. ప్రతి ట్రాక్టరు, ప్రతి టిప్పరుకు స్థానిక ఎమ్మెల్యేలకు చెల్లించవలసిన సుంకం భారీగానే ఉంటోందనేది క్షేత్రస్థాయి వాస్తవం. అయితే వాస్తవాలకు ముసుగులు వేసి ప్రభుత్వానికి భజన చేయాలని పచ్చమీడియా తాపత్రయపడడం గమనిస్తే ప్రజల్లో పుట్టే వ్యతిరేకతను కూడా మాయ చేయడానికి ఆరాటపడుతున్నట్టు అనిపిస్తోంది.