Hot Posts

6/recent/ticker-posts

జూన్ 9వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేపట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి: ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు


ANDRAPRADESH, VISAKHAPATNAM / ELURU: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జూన్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో  కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు.


విశాఖపట్నంలో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా శాఖలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రద్దయిన కార్మిక చట్టాలలో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు కూడా ఉన్నాయి. అవి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతన చెల్లింపు చట్టం 1958.
 
వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు  కాపాడేందుకు, వేతనాల చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు తోడ్పడతాయి.  

ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు  విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనకు రాకుండా పోతాయి. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ రెండు చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కోరుతోందని తెలిపారు.  

మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైన కాదని ఫెడరేషన్ అభిప్రాయ పడుతోందని తెలిపారు.  జూన్ 9వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేపట్టే ఆందోళనతో పాటు, జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఫెడరేషన్ జిల్లా శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నామని ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు తెలిపారు.