Hot Posts

6/recent/ticker-posts

యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి: ఏలూరు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి..


చారిత్రక ప్రదేశాల్లో యోగా శిబిరాలు.. 
మంగళవారం వెయ్యిమందితో భారీ ర్యాలీ..


ఏలూరు: యోగాను విస్త్రృంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్దానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం నుంచి మండలాల్లో యోగాభ్యాస కార్యక్రమాలుప్రారంభించాలన్నారు.  

జిల్లాలోని 4 చారిత్రక ప్రదేశాల్లో యోగా శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. మే 29వ తేదీన ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రంలో హరిత హోటల్ వద్ద, జూన్ 5వ తేదీన పోలవరం మండలం పట్టిసీమ రివర్ ఇన్ రిసార్ట్ వద్ద, జూన్ 11వ తేదీన జంగారెడ్డిగూడెం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, జూన్ 18వ తేదీన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం, గుంటుపల్లి బౌద్ధరామాల వద్ద, యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి యోగాభ్యాసకులు హాజరయ్యేలా ఆయా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

అదే విధంగా ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు,తిరిగి కొత్త బస్టాండ్ వరకు వెయ్యి మందితో సామూహిక యోగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 

సమావేశంలో డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. భీమేశ్వరరావు, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్, ఆయూష్ ఆర్ డిడి లక్ష్మీసుభధ్ర, డిఇఓ కె. వెంకటలక్ష్మమ్మ, పర్యాటక శాఖ మేనేజరు పట్టాభి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.