Hot Posts

6/recent/ticker-posts

మైసూర్ పాక్ చ‌రిత్ర ఇదీ.. అవ‌మానించొద్దు: రాజావారి వంట‌మ‌నిషి


SPECIAL: జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో ఉన్న ప‌ర్యాట‌క ప్రాంతంలో గ‌తనెల 22న ఉగ్ర‌వాదులు దాడులు జ‌ర‌ప‌డం .. 26 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీనివెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని పేర్కొన్న భార‌త ప్ర‌భుత్వం.. వెంట‌నే ఆప‌రేష‌న్ సిందూర్‌ను చేప‌ట్టింది. దీనిద్వారా కీల‌క‌మైన 9 ల‌క్ష్యాల ను ఏర్పాటు చేసుకుని పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. దీనికి ప్ర‌తిగా.. పాక్ దాడుల‌కు దిగింది. మొత్తానికి భార‌త్ పైచేయిసాధించింది.


అయితే.. పాకిస్థాన్ కు వ్య‌తిరేకంగా భార‌త్‌లో ఉద్య‌మాలు జ‌రిగాయి. తిరంగా ర్యాలీలు జ‌రిపి.. భార‌త సైని కుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ క్ర‌మంలోనే `పాక్‌` అన్న పేరు వినిపిస్తేనే భార‌త ప్ర‌జ‌లు మండిప‌డ్డారు. `పాక‌` పేరును స్వ‌చ్ఛందంగానే ప్ర‌జ‌లు ఛీత్క‌రించారు. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన సంప్ర‌దాయ వంట‌కాల‌కు ఉన్న `పాక్‌` పేరును కూడా మార్పు చేశారు. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగా చిర‌ప‌రిచ‌య‌మైన మైసూర్ పాక్ పేరుపై కూడా వివాదం రేగింది. పాక్‌ను తీసేసి.. మైసూర్ శ్రీగా పేరు పెట్టారు.

అయితే.. ఈ విష‌యంపై తాజాగా కొన్ని ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కు మైసూరు మ‌హారాజు కుటుంబానికి వంటలు చేసిన కుటుంబం స్పందించింది. మైసూర్‌ను పాలించిన వ‌డ‌యార్ రాజ‌కుటుంబానికి `క‌కాసుర మ‌డ‌ప్ప‌` అనే వ్య‌క్తి కుటుంబం వంట‌లు చేసేది. ఆ కుటుంబ వారసుడిగా ప్ర‌స్తుతం ఎస్‌. న‌ట‌రాజ్ ఉన్నారు. ఈయ‌న కూడా.. వంట‌లు చేయ‌డంలో దిట్ట‌. ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర పుల్లారెడ్డి స్వీట్స్ మాదిరిగానే క‌ర్ణాట‌క‌లో ఈయ‌న గురు స్వీట్స్ పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారంచేస్తున్నారు.

మైసూర్ పాక్‌లోని పాక్‌పై ఆయ‌న స్పందిస్తూ.. 19వ శతాబ్దంలో నాలుగో కృష్ణరాజ వడయార్‌ వద్ద వంటవాడిగా ఉన్నత‌న తాత‌ కకాసుర మడప్ప ఈ మిఠాయిని తొలిసారిగా తయారుచేశార‌ని తెలిపారు. రాజుకు అది బాగా నచ్చడంతో ఆ రాజవంశానికి గుర్తుగా ‘మైసూర్‌పాక్‌’గా పేరు పెట్టార‌ని.. కాబ‌ట్టి.. ఇది పాకిస్థాన్‌కు సంబంధించింది కాద‌న్నారు. అచ్చం మ‌న భార‌తీయ సంప్ర‌దాయానికి సంబంధించిన వంట‌క‌మేన‌ని చెప్పారు. కన్నడలో ‘పాక’ అంటే చక్కెర లేదా బెల్లంతో చేసే పదార్థం అని అర్థమ‌ని వివ‌రించారు. కాబ‌ట్టి మైసూర్ పాక్‌లో వేరే అర్థాలు తీయొద్దని ఆయ‌న కోరారు. అలా చేస్తే.. మ‌న పూర్వీకుల‌ను మ‌నం అవ‌మానించిన వార‌మ‌వుతామ‌న్నారు.