Hot Posts

6/recent/ticker-posts

ఆ హత్యల వెనుక పిన్నెల్లి..? పోలీసు కేసు నమోదు!


ANDRAPRADESH, PALNADU: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. BY: PASCHIMA VAHINI నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సహకరించారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసు కేసు నమోదు అవ్వగానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారని అంటున్నారు.

వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. గత ప్రభుత్వంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త చంద్రయ్యది ఇదే గ్రామం కావడంతో జంట హత్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యర్థులు పీకకోస్తున్నా, అప్పట్లో చంద్రయ్య జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసి మరణించారు. ఆయన మరణం తర్వాత గ్రామంలో హతులు వెంకటేశ్వరులు, ఆయన సోదరుడు కోటేశ్వరరావు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఇద్దరిని అంతం మొందిస్తే తమకు తిరుగు ఉండదని భావించిన ప్రత్యర్థులు హత్యకు కుట్ర పన్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దీనిపై విచారణ జరిపిన పోలీసులు హతులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుకు సమీప బంధువు అయిన జవిశెట్టి శ్రీనును ఏ1గా గుర్తించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన తోట వెంకట్రామయ్య ఏ2, తోట గురవయ్య ఏ3, డి.నాగరాజు ఏ4, తోట వెంకటేశ్వర్లు ఏ5గా గుర్తించారు. ఇక నిందితులకు సహకరించారనే ఆరోపణలతో ఏ6గా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (ఏ7)పై 302 సెక్షన్ కింద కేసు పెట్టారు.

తెలంగాణలో ఓ శుభకార్యానికి వెళ్లివస్తుండగా, వెంకటేశ్వరులు, ఆయన సోదరుడు కోటేశ్వరరావును నిందితులు వాహనంతో ఢీకొట్టారు. ఆ తర్వాత రాళ్లతో కొట్టి హత్య చేశారని, ఘటన తర్వాత నిందితులు పారిపోతుండగా తాను చూశానని హతుల సమీప బంధువు పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. దీంతో పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసు కావడంతో జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి పరామర్శించి, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు హత్య ఘటన తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పరార్ అయినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్నెల్లిని అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయట ఉన్నారు. మరోవైపు పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏడాదిగా పరారీలో ఉన్నారు. ఆయనపై మొత్తం 7 కేసులు పెండింగులో ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చిందని చెబుతున్నారు. తాజా హత్య కేసుల్లో వారికి ప్రమేయం ఉందన్న ప్రచారంతో పాత కేసుల్లో బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.