ANDRPRADESH, VIJAYAWADA: ఓ బెదిరింపు కాల్ విజయవాడ పోలీసులను హై అలర్ట్ చేసింది. BY: PASCHIMA VAHINI రాష్ట్రంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నారన్న అనుమానం పోలీసులకు ఉండటంతో అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం విజయనగరంలో ఉగ్రవాద సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడలో బాంబు పెట్టామంటూ వచ్చిన కాల్ ను సీరియస్ గా తీసుకున్నారు.
శనివారం ఉదయం విజయవాడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంటు రోడ్డుకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. బ్యాంబ్ స్కాడ్, పోలీసు జాగిలాలతో అణువణువూ జల్లెడపడుతున్నారు. తాము చెప్పినంతవరకు షాపులు తెరవొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో సుమారు 15 మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని ఒక రోజు ముందే పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నగరంలో అనుమతిలేని విదేశీయులు ఎవరన్న విషయమై ఆరా తీశారు. తాడిగడపలో నివాసముంటున్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్థులు సుమారు 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులకు సమాచారం వచ్చేవరకు విదేశీయులు అక్రమంగా నివసిస్తున్న విషయం తెలియలేదు. దీంతో బాంబు పెట్టామంటూ వచ్చిన ఫోన్ కాల్ ను పోలీసులు తేలిగ్గా తీసుకోకుండా హైఅలర్ట్ అయ్యారు. వరుస ఘటనలతో రాష్ట్రంలో పోలీసులు అటెన్షన్ అయ్యారు.