ANDRAPRADESH, AMARAVATHI: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలిసారి స్పందించారు. BY: PASCHIMA VAHINI కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం విధానంలో రూ.3,200 కోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో వైసీపీకి చెందిన పలువురు నేతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఈ స్కాంలో గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో నెక్ట్స్ జగన్ నే అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో ఆయన తొలిసారి స్పందించారు.
లిక్కర్ స్కాం అంటూ ప్రభుత్వం దాదాపు పది నెలలుగా హడావుడి చేస్తున్నా మాజీ సీఎం జగన్ ఎప్పుడూ ఆ అంశంపై సీరియస్ గా స్పందించలేదు. కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని మాత్రమే వ్యాఖ్యానించి సరిపెట్టేవారు. తన చుట్టూ ఉన్నవారిని అరెస్టు చేసినప్పుడు కూడా ఆయన ఈ తరహా విమర్శలే తప్ప, నేరుగా స్కాంపై స్పందించలేదు. కానీ, గురువారం తాడేపల్లిలో ప్రత్యేకంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లిక్కర్ స్కాంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలిసారిగా స్పందించారు.
తమ హయాంలో లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయని, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందని చెప్పారు. తమ ప్రభుత్వ విధానం వల్ల లిక్కర్ అమ్మకాలు తగ్గి మద్యం కంపెనీలు నష్టపోయాయని అలాంటప్పుడు మద్యం కంపెనీలు లంచాలు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. ప్రైవేటుగా మద్యం వ్యాపారం చేస్తే లంచాలిస్తారు కానీ, ప్రభుత్వమే మద్యం కొనుగోలు, అమ్మకాలు చేసినప్పుడు లంచాలకు అవకాశం ఎక్కడుంటుందని మాజీ జగన్ నిలదీశారు.
తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్న ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమే మద్యం కుంభకోణానికి పాల్పడుతోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తీసివేసిన ప్రభుత్వం మద్యాన్ని మాత్రం డోర్ డెలవరీ చేస్తోందని దుయ్యబట్టారు. మద్యం షాపుల్లో పర్మిట్ రూములు నిర్వహించడంతోపాటు ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలకు లిక్కర్ అమ్మకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పాలసీలో లంచాలకు ఆస్కారం ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
మద్యం స్కాంలో నెక్ట్స్ ఎవరిని అరెస్టు చేస్తారని ప్రశ్న కొంతకాలంగా రాష్ట్రంలో వినిపిస్తోంది. ముఖ్యంగా కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు డబ్బు అంతిమ లబ్ధిదారు ఎవరో బయటపెట్టలేదు. అదేవిధంగా అవినీతి జరిగిందని చెబుతున్న రూ.3,200 కోట్లు ఎక్కడ ఉంది? ఎలా డబ్బు అంతిమ లబ్ధిదారుకు చేరిందన్న విషయమై స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు బిగ్ బాస్ పై అన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే అరెస్టు అంటూ ప్రచారం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ స్పందించడం ఆసక్తి రేపుతోంది.