ఏలూరు: జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలు వారీగా స్వర్ణాంధ్ర @ 2047 విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకుగాను అధికారులకు రెండు రోజులు పాటు నిర్వహించిన వర్కుషాపులో ఉభయ జిల్లాల చీఫ్ ప్లానింగు అధికారులు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బందితో కలిసి తొలిరోజు వర్కుషాపులో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు.
జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంటు రూపొందించడంపై జిల్లా కలెక్టరు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా వార్డు, గ్రామ సచివాలయాలు డేటా అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు మనోభావాలు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్-2047 లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుటలో ప్రత్యేక దృష్టి పెట్టారని ఇప్పటికే కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ సహా నాలుగు నియోజకవర్గాలకు పైలట్ ప్రాతిపదికన విజన్ డాక్యుమెంట్లు ఇప్పటికే సిద్ధం చేశారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిటకు రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్, ఆర్థికాభివృద్ధికి కీలక రంగాల పరంగా దృష్టి సారించాలని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర మరియు పర్యావరణ అనుకూలమైన వృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెంపుదల, భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగాల కల్పనకు, శ్రామికశక్తిని ప్రోత్సహం అందించే క్రమంలో దృష్టి పెట్టాలన్నారు. మహిళా సాధికారత - సంపూర్ణ మహిళా సాధికారత సాధనకు ఉపకరించే అంశాలు, రైతుల ఆకాంక్షలు, బలహీన వర్గాల వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్లాన్ లో స్పష్టంగా పొందుపరచాలని అన్నారు.
వికసిత్ భారత్ నేపద్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యసాధన కోసం నియోజక వర్గాలు వారీగా సమర్థ వంతంమైన ప్రణాళికలు అందజేయవలసి ఉందన్నారు. ఇందులో భాగంగా రానున్న 5 యేళ్ల కాలంలో 2029 వరకు ఒక విజన్ తో కూడిన నివేదిక రూపొందించ వలసివుందన్నారు. ఇందుకు జిల్లాలోని ప్రతి శాఖ ఈ లక్ష్య సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించవలసి వుందన్నారు. వ్యవసాయ, ఉధ్యానవన, మత్స్య రంగాల్లో ప్రస్తుత విస్తరణ, దిగుబడులు, రానున్న రోజుల్లో అంతరసాగు విధానం, ఆదాయం పెంపు, ప్రకృతిసాగు విస్తీర్ణ పెంపు, తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచవలసి ఉందన్నారు.
పాల ఉత్పత్తి పెంపుదలకు అవసరమైన అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. పారిశ్రామిక, పర్యాటక రంగ, ఫుడ్ ప్రోసెసింగు యూనిట్ల స్ధాపన, వంటి అంశాలను ప్రణాళికలో జోడించాలన్నారు. 2047 నాటికి జాతీయ మరియు ప్రపంచ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషించడం వంటి అంశాలపై, తలసరి ఆదాయం ఎలా పెంచాలి తదితర అంశాలు పొందుపరచి విజన్ డాక్యుమెంటు రూపొందించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అన్నారు.
ఈ వర్కుషాపులో ఉమ్మడి జిల్లాల ముఖ్య ప్రణాళిక అధికారులు సి.హెచ్. వాసుదేవరావు, కె.శ్రీనువాస రావు, విశ్రాంత జాయింటు డైరెక్టరు మరియు సీనియరు ఎకనామిక్ సలహాదారులు డి.వి.వి.సీతాపతిరావు, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు, సివిఏపి సిబ్బంది, ప్లానింగు టెక్నికల్ సలహాదారులు జి.దుర్గాప్రసాదు, డి.రామనాథ రెడ్డి, కె.రామ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.