Hot Posts

6/recent/ticker-posts

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించండి!.. సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్స్ కు, కార్పొరేటర్స్ కు - రాజేంద్రప్రసాద్ పిలుపు


ఏలూరు జిల్లా కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, సర్పంచ్ల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరము జిల్లా కలెక్టర్ ను కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై పదహారు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది.

2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐలకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పిటిసిలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లుకు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చినారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన నిర్ణయం అని మాకు తెలుసు కానీ మాకు మరో దారి లేక ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మా నిధులు, అధికారాలను, విధులను దొంగిలించి వేసినారని, అవి తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపితో సహా మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.

12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, మేము స్థానిక ప్రజాప్రతినిధులం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డామని అన్నారు. ఈ తప్పు మాది కాదు - జగన్ దే‌ అని అన్నారు.

అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం ఈ రోజున తీసుకోవడం జరిగిందని చెప్పారు.

రెండు నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని, అధికార వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని ఓడించడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైయస్సార్సీపి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ తీవ్రంగా కృషి చేయాలని కోరారు.

మన గ్రామాల, పట్టణ ప్రజలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని సాక్షాదారాలతో సహా వివరించి చెప్పి జగన్ కి వ్యతిరేకంగా మన ప్రజలతో ఓటు వేయించి ఓడించాలని, జగన్ ఓడితేనే మన మనుగడ అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి (కర్నూలు జిల్లా), రాష్ట్ర ఉపాధ్యక్షులు వై వినోద్ రాజు (విశాఖ జిల్లా), చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్, సర్పంచుల సంఘం గౌరవ సలహాదారులు పిల్లి సత్తిరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పాలడుగుల లక్ష్మణరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు కడలి గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.