- దొమ్మేరు పరిణామాలపై తీవ్ర మనస్థాపానికి గురి చేశాయి..
- ముఖ్యమంత్రి, కొవ్వూరు ప్రజల ఆశీస్సులతోనే దళిత మహిళనైన
తనకు హోంమంత్రి పదవి
- వివరాలను వెల్లడించిన హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరులో గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై తనకు ఏమీ సంబంధం లేకపోయినా కొంతమంది బొంతా మహేంద్ర మరణాన్ని స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకోవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. దొమ్మేరు పరిణామాలన్నీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి వివరించామని, మహేంద్ర మరణంపై అన్ని వాస్తవాలు బయటకు వచ్చేలా తాను విచారణ కోరగా.. ముఖ్యమంత్రి సీఐడీ విచారణకు ఆదేశించారని తానేటి వనిత వెల్లడించారు. శుక్రవారం కొవ్వూరు హోంమంత్రి వారి కార్యాలయంలో మీడియా ప్రతినిధులకు వివరాలను తెలిపారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దొమ్మేరులో బొంతా మహేంద్ర మరణం, దానిపై తనను నిందించడం చాలా మనస్థాపానికి గురయ్యానని తెలిపారు. మహేంద్ర మరణంలో తాను ఏ విధంగా కారకులు అవుతానని ప్రశ్నించారు. తనపై వచ్చిన అభియోగాలపై ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నానన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీయంగా వైసీపీని ఎదుర్కొలేక తనపై, ప్రభుత్వం మీద, పార్టీ మీద జనసేన పార్టీ వాళ్లు రాజకీయ కుట్ర చేస్తున్నారన్నారు. అమాయకులైన దళితులను ఉపయోగించుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికి చెక్ పెట్టేందుకు సీఐడీ ఎంక్వైరీ ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు.
నవంబర్ 13వ తేదీన జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి కూడా తనతో పాటు ఉదయం పూట గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారని, ఆమె భర్త నుంచి ఫోన్ వస్తే ఫ్లెక్సీల వివాదంలో అబ్బాయిని పోలీసులు తీసుకెళ్తున్నారని చెప్పారని వివరించారు. వెంటనే తన పీఏతో ఫోన్ చేయించి ఇంటికి పంపించడం జరిగిందన్నారు. తర్వాత ఏం జరిగిందో.. జడ్పీటీసీ నాకు తెలియజేయలేదన్నారు. నవంబర్ 14న పెనకనమెట్ట గడప గడపకు కార్యక్రమంలో మహేంద్ర పాయిజన్ తీసుకున్నారని నాయకుల ద్వారా తెలిసిందన్నారు.
చాగల్లు ఆసుప్రతి నుంచి రాజమండ్రి ఆసుపత్రి షిప్ట్ చేశారని తెలిసి.. బొల్లినేని ఆసుపత్రి డాక్టర్ కి తాను స్వయంగా ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని, మహేంద్ర తన కుటుంబ సభ్యుడని మాట్లాడినట్లు తెలిపారు. విజయవాడకు తరలించిన విషయం హోంమంత్రికి తెలియదన్నారు. 15వ తేదీ ఉదయం ఏలూరు డీఐజీ నుంచి మిస్డ్ కాల్ ఉందన్నారు. తిరిగి డీఐజీకి కాల్ చేస్తే మహేంద్ర చనిపోయినట్లు తెలిపారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే.. లేనిపోని కల్పితాలతో మాట్లాడటం సరికాదన్నారు. ఒక దళిత మహిళగా.. హోంమంత్రిగా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యమంత్రి, కొవ్వూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరి సహాకారంతోనే సాధ్యమయ్యిందన్నారు.
కుట్రలు, కుతంత్రాలతో ఉన్నత స్థానాలు రావన్నారు. నూజివీడులో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో తాను పాల్గొని సీఎంకి అన్ని విషయాలను వివరించానని తెలిపారు. మహేంద్ర మరణం వెనుక ఎలాంటి నిజానిజాలు ఉన్నాయో, ఏ రకమైన సంఘటనలు జరిగాయో తెలియాలంటే కచ్చితంగా సీఐడీ విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సీఐడీ విచారణ వేస్తామని తెలిపారు. సీఐడీ విచారణ తర్వాత ఆ మరణం వెనుక కుట్రలు, కుతంత్రాలు బయటకు తెలుస్తాయన్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి సహాకారంతో 2014 నుంచి తాను పనిచేస్తున్నానని వివరించారు. తొమ్మిదన్నర సంవత్సరాలుగా తమపై ప్రేమ చూపిన ప్రేమ చూపిన, తనకు సపోర్ట్ గా నిలిచిన నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబం రాజకీయ నేపథ్యాన్ని వివరిస్తూ ఎవరితోను విభేదాలు లేకుండా అందరితోను కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవాళ్లమని తెలిపారు. సీఐడీ విచారణతో త్వరలోనే నిజా నిజాలు అందరికీ తెలుస్తాయని హోంమంత్రి తానేటి వనిత ఆశాభావం వ్యక్తం చేశారు.