ఏలూరు, పశ్చిమ వాహిని, మే 7: దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన అమరజీవి Alluri Sitarama Raju నేటి యువతకు ఆదర్శప్రాయుడని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మన్యం ప్రాంత గిరిజనులను సంఘటితం చేసి పోరాటానికి అల్లూరి నాయకత్వం వహించారని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆయన పోరాటం దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించిందన్నారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం ప్రత్యేకమైనదని జేసీ అభిషేక్ గౌడ కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, కలెక్టరేట్ సిబ్బంది పోతురాజు, చలపతి, శేషగిరిరావు, రవికుమార్, క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ తదితరులు పాల్గొన్నారు.


