తాజా వార్తలు

10/recent/ticker-posts

మత్తు పదార్థాల నిర్మూలనకు కట్టుదిట్ట చర్యలు… బోస్కో డీ-అడిక్షన్ సెంటర్‌ను ఐజీ సందర్శన


నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 18: సమాజంలో పెను సవాలుగా మారుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఈగల్ సెల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ పేర్కొన్నారు.

బుధవారం నూజివీడులోని బోస్కో డీ-అడిక్షన్ సెంటర్‌ను ఆయన సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ పర్యటనలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు, డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్, రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారు నేరస్తులు కాదని, వారు బాధితులని పేర్కొన్నారు. సరైన కౌన్సెలింగ్, చికిత్స ద్వారా వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని అన్నారు. ఈ దిశగా పునరావాస కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని వివరించారు.

బోస్కో డీ-అడిక్షన్ సెంటర్‌లో అందిస్తున్న సదుపాయాలు, మానసిక మార్పు కార్యక్రమాలు అభినందనీయమని ఆయన కొనియాడారు. మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడంలో పాటు, వ్యసనపరులకు విముక్తి కలిగించడంలో పోలీస్ శాఖ ముందుంటుందని భరోసా ఇచ్చారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని సూచించారు.

మత్తు అలవాట్లకు దూరంగా ఉండి యువత తమ భవిష్యత్తును కాపాడుకోవాలని, వ్యసనంలో చిక్కుకున్న వారు భయపడకుండా పునరావాస కేంద్రాలను ఆశ్రయించాలని ఐజీ విజ్ఞప్తి చేశారు. మత్తు రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ యంత్రాంగం, పునరావాస కేంద్రాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన నొక్కిచెప్పారు.