తాజా వార్తలు

10/recent/ticker-posts

కర్నూలు జిల్లాలో దారుణం.. నిద్రపోతున్న భర్తను గొంతు కోసి చంపిన భార్య, ప్రియుడు!


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు,పశ్చిమ వాహిని, మార్చి 24: క్షణం సుఖం కోసం నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివాహమైనా భర్తతో సుఖమైన జీవితం లేదని ప్రియుని మోజులో పడి కుటుంబాలు పాడుచేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటనే జరిగింది. ప్రియుని మోజులో పడి భర్త అడ్డు తొలగించుకునేందుకు భర్తనే హత్య చేయించింది. ఆధారాలు కూడా లేకుండా చేయాలని మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారులో కాటన్ మిల్ ఎదురుగా పూర్తిగా కాలిపోయిన గుర్తు తెలియని శవం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తిని గోనెగండ్ల మండలం పెద్దనేలటూరుకు చెందిన ఏసేబు అలియాస్ పులి నరేంద్రగా గుర్తించారు పోలీసులు. ఏసేబును హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏసేబు హత్యకు ప్రధాన కారణాలు, హంతకులు ఎవరని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

ఏసేబు హత్యకు వివాహేతర బంధమే కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. యేసేబుకు 9 ఏళ్ల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన పద్మతో వివాహం జరిగింది. ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. పేదరికంలో ఉన్నా కొన్నేళ్లపాటు ఏసేబు, పద్మ సంసారం అన్యోన్యంగానే సాగింది. కూలి పనులు చేసుకొని జీవనం సాగించారు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఒక యువకునితో పద్మకు ఏర్పడిన పరిచయం చిచ్చు రేపింది. ఏడాది క్రితం పెద్దనెలటూరులో ఉన్న వంశీ అనే యువకుడితో పద్మకు ఉన్న పరిచయం కాస్త వివాహేతర బంధంగా మారిందని సమాచారం. ఇంట్లో పద్మ, వంశీ సన్నిహితంగా ఉండడాన్ని పిల్లలు గమనించి చెప్పడంతో వ్యవహారం బయటపడింది.

ఈ క్రమంలో ఏసేబు, పద్మ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒక దశలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని పంచాయితీ చేసి సర్దిచెప్పారు. చివరికి వంశీకి, నరేంద్రకు మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అయినా పద్మ తీరు మార్చుకోకపొగా నరేంద్రను వదిలి పుట్టినిల్లు ఎమ్మిగనూరుకు చేరుకుంది. తనకు భర్త వద్దని లాయర్ నోటీసు కూడా ఇచ్చింది పద్మ. అయితే తనకు భార్య కావాలని భర్త నరేంద్ర చెప్పడంతో మరోసారి పెద్దమనుషులు పంచాయితీ చేశారు. అయితే పెద్దనెలటూరుకు రావడానికి పద్మ ససెమిరా అంగీకరించలేదు.

కానీ పిల్లల సెలవులు పూర్తయ్యాక రావాలని చెప్పడంతో ఎట్టకేలకు అత్తగారింటికి వెళ్లేందుకు పద్మ ఒప్పుకుంది. ఈ క్రమంలో ఏసేబు భార్య పద్మ దగ్గరకు వెళ్లాడు. శనివారం భర్త రాకను ప్రియుడు వంశీకి చేరవేసింది పద్మ. అర్ధరాత్రి రాత్రి భర్త పడుకున్న సమయంలో వంశీ వచ్చి పదునైన ఆయుధంతో నరేంద్ర గొంతులో పొడిచాడు. అంతకు ముందే నరేంద్ర తప్పించుకోకుండా తాడుతో బిగించినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత ఆటోలో డెడ్ బాడీని తీసుకువెళ్లి ఎమ్మిగనూరు- కర్నూలు బైపాస్ రోడ్డులో కాటన్ జిన్నింగ్ మిల్ ఎదురుగా పొలాల్లో తరలించి మృతదేహాన్ని చాపలో చుట్టి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు. ఆ తరువాత రోజు పద్మ తన అత్తకు ఫోన్ చేసి …భర్త ఫోన్ ఇక్కడే మర్చిపోయాడని.. ఇంటికి వచ్చారా అంటూ ఆరా తీసింది.

ఏసేబు అలియాస్ నరేంద్ర హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పద్మ విచారణలో చెప్పినట్లు సమాచారం. పద్మ చెప్పిన వివరాల మేరకు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మృతదేహానికి సంఘటన స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పద్మ, ఆమె ప్రియుడు వంశీని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు నరేంద్ర తల్లి. పద్మతోపాటు ఆమె ప్రియుడు వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.