ఏలూరు, పశ్చిమ వాహిని, మే 7: మహిళలు మరియు విద్యార్థినులు తమ హక్కులు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని భీమడోలు పోలీసులు సూచించారు. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీమడోలు ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ షేక్ మదీనా బాషా ఆర్జవారిగూడెం గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా రక్షణ చట్టాలు, ఈవ్టీజింగ్, గృహ హింస, మహిళలపై జరిగే వేధింపుల నిరోధక చట్టాలపై ఎస్ఐ మదీనా బాషా వివరించారు. ఎవరైనా ఇబ్బందులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మహిళలకు ధైర్యం చెప్పారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లలో “దిశ యాప్” ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. అలాగే ఎలాంటి ప్రమాదం లేదా అనుమానాస్పద పరిస్థితి ఎదురైనా వెంటనే 112 హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. సైబర్ మోసాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలపై బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే ఆకతాయిలపై నిఘా ఉంచేందుకు “శక్తి టీమ్స్” నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. బాధితులు రహస్యంగా కూడా పోలీసులకు సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు గమనించినా లేదా తమకు రక్షణ అవసరమైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందని, వారి భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం అండగా ఉంటుందని ఎస్ఐ మదీనా బాషా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా పోలీస్ సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థినులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


