ANDHRAPRADESH:ఏపీ కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మిషన్ 2029 వ్యహాల ను అమలు చేస్తోంది. కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. కాగా, తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీడీపీ మరో సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది.
టీడీపీకి ప్రాధాన్యత
బీజేపీ అధినాయకత్వం ఎన్డీఏ విస్తరణలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత పెంచుతోంది. త్వరలో బీహార్ .. ఆ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. అయితే, అమలు కాలేదు. ఈ సారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవి పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవి పైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం.
మరో గవర్నర్ పదవి..!
టీడీపీకి మరో గవర్నర్ పదవి పైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతి రాజు కు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవి ర్భావం నుంచి ఉన్న నేత కావటంతో పాటుగా వివాద రహితుడు.. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతి రాజు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, బీసీ - ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవి పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రము ఖంగా ఉన్నా .. ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో, రెండో గవర్నర్ పదవి రాయలసీమ కు చెందిన బీసీ నేతకు ఇస్తారనే వాదన వినిపిస్తోంది.
చంద్రబాబు ఛాయిస్
రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పని చేసి.. ఆ తరువాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ క్రిష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లు సమాచారం. అయితే, కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. పత్తికొండ నుంచి గెలుపొందారు. ఆ తరువాత కేఈ క్రిష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పని చేసారు. దీంతో.. ఈ సారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక.. జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ - తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీని ద్వారా త్వరలోనే టీడీపీ నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.