ANDRAPRADESH, SRIKAKOLAM, TELANGANA: వినాశకాలే విపరీత బుద్ధి.. దురాశ దుఃఖానికి చేటు.. ఇలాంటి సామెతలు చిన్నప్పటి నుంచి ఎన్నో వింటూ వస్తున్నా్ం. BY: PASCHIMA VAHINI ఈ సామెతల అర్థం తెలుసుకుని మసలితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాదని.. పేరాశతో వ్యవహరిస్తే.. చివరకు ఇదిగో ఇలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అసలు సంగతిలోకి వస్తే.. అతనో మాజీ క్రికెటర్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. రంజీ మ్యాచ్లు కూడా ఆడినట్లు చెప్తుంటారు. అయితే అడ్డగోలుగా సంపాదించాలనే దుర్బుద్ధి పుట్టింది. దీంతో వాట్సాప్కి ముఖ్యమంత్రుల డీపీలు పెట్టి మోసం చేయడం మొదలుపెట్టారు. సీఎం పీఏ నంటూ, సీఎం ఓఎస్డీ అంటూ బెదిరింపులకు పాల్పడటం, డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. అలా..అలా చివరకు జైలు పాలు కావాల్సి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓఎస్డీని అంటూ బెదిరింపులకు పాల్పడుతోన్న ఆంధ్రాకు చెందిన బుడుమూరు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బుడుమూరు నాగరాజు.. ర్యాపిడో, కంట్రీ డిలైట్ సంస్థల ఎండీలకు ఫోన్ చేసి సీఎం ఓఎస్డీనంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుడుమూరు నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాగరాజు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీనని చెప్తూ పలువురు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు మెసేజ్ పెట్టినట్లు తెలిసింది. అలాగే ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళంలో నాగరాజును అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. రిమాండ్కు తరలించారు.
బుడుమూరు నాగరాజుపై గతంలోనూ కేసులు నమోదయ్యాయి. 2023లో శ్రీకాకుళంలో గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 29 క్రిమినల్ కేసులలో నాగరాజు వాంటెడ్గా ఉన్నట్లు తెలిసింది. ఇందులో తెలంగాణలో 13 కేసులు, ఏపీలో 16 కేసులు ఉన్నాయి. 2020లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసులో బుడమూరు నాగరాజుపై నాన్ బెయిలబుల్ కేసు పెండింగ్లో ఉంది. అలాగే సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే కారణంగా గతేడాది డిసెంబర్లోనూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు. 2019లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పేరుతో మోసం చేస్తున్నాడనే కారణంతో విజయవాడ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో క్రికెట్ అకాడమీ పెడుతున్నానంటూ ఎంఎస్కే ప్రసాద్ పేరుతో వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశారనే కారణంతో అరెస్ట్ చేశారు.
రంజీ క్రికెటర్.. చీటర్గా ఎలా మారాడు..?
శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేటకు చెందిన 32 ఏళ్ల బుడమూరు నాగరాజు.. తాను గతంలో ఆంధ్రా తరుఫున రంజీ మ్యాచ్లు ఆడినట్లు చెప్పుకుంటూ ఉంటారు. తాను ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని, మాజీ రంజీ ఆటగాడినని చెప్పుకుంటారు. అయితే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాగరాజు వాదనలను తోసిపుచ్చుతోంది. 2023 మేలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్నిహితుడినంటూ మోసం చేసినందుకు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2021లో కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా నటించి తొమ్మిది కార్పొరేట్ సంస్థలను రూ.40 లక్షలకు మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి అతను ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు.
అయితే తాను ఇలాంటి మోసాలకు పాల్పడటానికి ప్రతీకారమే కారణమని బుడమూరు నాగరాజు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకుడు తనను రూ. 15 లక్షలకు మోసం చేసారని.. దాంతో తన క్రికెట్ కెరీర్ నాశనమైందనేది నాగరాజు వాదన. అప్పటి నుంచి దానికి ప్రతీకారంగా ఈ పనులు చేస్తున్నట్లు అతను అంగీకరించాడని కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అలాగే 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కోసం నాగరాజు ప్రయత్నించినట్లు కొన్ని కథనాలు చెప్తున్నాయి. సుదీర్ఘంగా క్రికెట్ నెట్ సెషన్లో పాల్గొని ప్రపంచ రికార్డు నమోదు చేసే ప్రయత్నం చేసినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.